social media : చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఈ విషయంపై స్పందించిన కొన్ని దేశాలు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించింది. పిల్లల సంరక్షణ కోసం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. సోమవారం ఈ విషయాన్ని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఇలా పిల్లల సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా దేశాల తర్వాత నాలుగో దేశంగా ఇప్పుడు బ్రిటన్ నిలిచింది.
దీనిపై కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. తాము నిషేధం విధించడం వల్ల టెక్ కంపెనీలు, విమర్శల నుంచి వచ్చే ఒత్తిడులకు తలొగ్గి, ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. ‘‘నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, బలంగా చెప్పదలచుకున్నా. పిల్లల సంరక్షణ, సంతోషం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. అందువల్లే పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాం. దీన్ని అమలు చేయడం అంత సులభమైన విషయం కాదు. కానీ, సమస్యను నియంత్రించడం తమ పరిధిలో లేదనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించే స్థితిలో లేదు. మాకు ఓ వ్యవస్థ ఉంది. మేం వాటిని మార్చగలం. సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల జీవితాలపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపిస్తోంది. ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు అభివృద్ధి ఆగిపోతోంది. ఎక్కువగా సోషల్ మీడియా వాడటం వల్ల పిల్లల ఎదుగుదలకు అత్యవసరమైన చదువు, ఆటలు, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సమయం గడపడం వంటివి కుదరడం లేదు’’ అని స్టార్మర్ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా సహా చాలా ప్లాట్ఫామ్స్ పిల్లల్ని వాటికి అలవాటుపడేలాగా తయారయ్యాయి. ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యాయయని, పిల్లల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని కీర్ అన్నారు. అందుకే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు తమ ప్రభుత్వం ఆన్లైన్ సేఫ్టీ కోసం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక, ఈ నిషేధం ఇప్పటికిప్పుడు అమలులోకి రాదు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు వచ్చే క్రిస్మస్లోపు రూపొందిస్తారు. ఇవి ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది.