మనం ఎక్కడికైనా వెళ్లాలంటే.. గతంలో ఆటోలు, ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్లం. కానీ ఇప్పుడు ఓలా, ఉబెర్, రాపిడో వంటివి ఈ స్థానాలను భర్తీ చేసేస్తున్నాయి. ప్రజలు వీటిపై బాగా ఆధారపడుతున్నారు. విదేశాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. అయితే ఈ అవసరాలను కొన్ని కంపెనీలు చాలా దారుణంగా క్యాష్ చేసుకుంటున్నాయి.
తాజాగా యూకేలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. శామ్ జార్జ్ అనే 21 ఏళ్ల యువకుడు.. మాంచెస్టర్ సిటీ సెంటర్లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికెళ్లేందుకు మాంచెస్టర్ సిటీ సెంటర్ నుంచి క్రంప్సాల్కు వెళ్లేందుకు ఉబెర్ ఎక్స్ఎల్ బుక్ చేసుకున్నాడు. దారిలో తన మిత్రులను ఒకచోట దింపేసి అతను ఇంటికెళ్లాడు.
ఇది మొత్తం సుమారు 12 మైళ్ల జర్నీ చూపించింది. ఈ జర్నీకి తనకు సాధారణంగా 25 యూరోలు ఖర్చవుతుందని, కానీ ఆరోజు ఉబెర్ బిల్లు 104.66 యూరోలు ఉందని చెప్పాడు. అంటే మన లెక్కల్లో రూ.10,500 అన్నమాట. ఈ బిల్లు చూసిన అతనికి దిమ్మతిరిగిపోయింది.
స్నేహితులతో చేసుకున్న పార్టీకి కూడా ఇంత ఖర్చు అవ్వలేదని అతను వాపోయాడు. సదరు కస్టమర్ రైడ్లో రెండు చోట్ల డ్రాప్ ఆఫ్లు ఉన్నాయట. ఇంత బిల్లు రావడంపై సదరు వ్యక్తి అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఉబెర్ సంస్థ కూడా దీనిపై స్పందించింది. కస్టమర్లు రైడ్ బుక్ చేసుకునే సమయంలోనే రైడ్కు ఎంత అవుతుందీ అంచనా చార్జి కనిపిస్తుందని వివరించింది.