అబుదాబి: తమ దేశాన్ని టార్గెట్ చేస్తూ హౌతీ ఉగ్ర మూకలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల అబుదాబి ఇంధన కేంద్రంపై యెమెన్ రెబల్స్ చేసిన దాడిలో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్తానీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత ఇవాళ మళ్లీ హౌతీలు చెలరేగారు. అయితే క్షిపణుల రాకను పసికట్టి, వాటిని ధ్వంసం చేసినట్లు యూఏఈ చెప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగేలదు. రాజధానిని అబుదాబి టార్గెట్ చేస్తూ ఆ మిస్సైళ్లను ప్రయోగించారు. అయితే వాటి శిథిలాలు అబుదాబి పరిసర ప్రాంతాల్లో పడ్డట్లు రక్షణశాఖ తెలిపింది. జనవరి 17వ తేదీన జరిగిన దాడిలో.. మూడు పెట్రోలియం ట్యాంకర్లు పేలాయి. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్థానీతో పాటు మొత్తం ఆరు మంది మరణించారు.
సౌదీ రక్షణ దళాలు ఓ సంయుక్త ప్రకటన జారీ చేశాయి. అసిర్ ప్రాంతంలో ఉన్న దహరన్ అల్ జానోబ్ను టార్గెట్ చేస్తూ మిస్సైల్ను ప్రయోగించారని, వాటిని ధ్వంసం చేసినట్లు రక్షణ దళాలు చెప్పాయి. ఎమిరేట్స్తో పాటు అబుదాబిని టార్గెట్ చేస్తూ మిస్సైళ్లు వదిలినట్లు హౌతీ రెబల్స్ ప్రకటించాయి. బాలిస్టిక్ మిస్సైళ్ల దాడులతో ప్రస్తుతం గల్ఫ్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నది.