అబూదాబీ, ఆగస్టు 30: అసలే ఎడారి దేశం. జనాభా పెరుగుదల, వాతావరణంలో మార్పులు వెరసి యూఏఈని నీటి కటకట వెంటాడుతున్నది. దీంతో మేఘమథనానికి అక్కడి శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సముద్రమట్టానికి 9 వేల అడుగుల ఎత్తున ఉన్న తెల్లటి మబ్బుల్లోకి వెళ్లి విమానాల సాయంతో ఉప్పు రేణువులను వెదజల్లనున్నారు. తద్వారా వర్షాలను కురిపించనున్నారు. దీనికోసం ‘హైగ్రోస్కోపిక్’ సాంకేతికతను వినియోగించనున్నారు.
ఏమిటీ హైగ్రోస్కోపిక్ టెక్నాలజీ?
మేఘమథనంలో సాధారణంగా ఉప్పును మేఘాలలోకి పంపిస్తారు. అయితే, తేమతో కూడిన వేడిగాలులు ఆ ఉప్పతో చర్య జరిపి వర్షంగా కురుస్తుందన్న గ్యారంటీ ఉండదు. అయితే యూఏఈ పరిశోధకులు వినియోగించబోతున్న ‘హైగ్రోస్కోపిక్’ సాంకేతికత సాయంతో.. మేఘాలు, అక్కడి వాతావరణంలో ఉన్న తేమను ఉప్పు రేణువులు కచ్చితంగా గ్రహిస్తాయి. అలా ఆ రేణువులు నీటితో నిండిన లవణ స్ఫటికాలుగా మారుతాయి. వేడిగాలులు తగలడంతో అవి కరిగి కుండపోత వర్షాలు కురుస్తాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ‘హైగ్రోస్కోపిక్’ మేఘమథనంతో సగటు వర్షపాతంలో 10 శాతం నుంచి 30 శాతం పెరుగుదల నమోదు చేయొచ్చు.
సవాళ్లు లేకపోలేదు
మేఘమథనం ప్రక్రియ పూర్తిచేయాలంటే దట్టమైన మేఘాల్లోకి విమానాలు చొచ్చుకుపోవాలని, ఈ సమయంలో పిడుగులు, వడగళ్లు పడితే పైలట్లకు ప్రమాదమేనని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే, మేఘాల్లో తేమశాతం ఎక్కువ ఉన్న ప్రాంతాల గుండా పైలట్లు విమానాన్ని నడుపకూడదన్నారు. కాగా, ‘హైగ్రోస్కోపిక్’ మేఘమథనంపై సౌదీ అరేబియా, ఇరాన్ తదితర దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.