కాబూల్, ఆగస్టు 19: అఫ్గానిస్థాన్ను ఆక్రమించుకొన్న తాలిబన్లు తమ అరాచకపర్వాన్ని మొదలెట్టారు. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని, మహిళలపై వివక్ష చూపబోమని వాళ్లు పలికిన శాంతి ప్రవచనాలు బూటకమేనని తేలింది. అఫ్గాన్ స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 19) రోజే తాలిబన్లు మారణహోమాన్ని సృష్టించారు. గురువారం దేశ స్వాతంత్య్ర దినం నేపథ్యంలో అసదాబాద్ నగరంలో కొందరు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. వారిపై తాలిబన్లు తూటాల వర్షం కురిపించారు. ఈ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో పలువు రు చనిపోయారు. ‘దేశ గౌరవం కోసం జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీగా వెళ్తున్న అఫ్గాన్ పౌరులకు సెల్యూట్’ అని మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ ట్వీట్ చేశారు. అఫ్గాన్ను కైవసం చేసుకోవడం పాక్కు, పాలించడం తాలిబన్లకు సాధ్యంకాదన్నారు. కాగా, తమకు వ్యతిరేకంగా బుధవారం జలాలాబాద్లో నిరసనలు చేపట్టిన వారిపై తాలిబన్లు కాల్పులు జరుపడంతో ముగ్గురు మరణించడం తెలిసిందే.
కాబూల్లోని పలు వ్యాపార సముదాయాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీల్లో మహిళల చిత్రాలను తాలిబన్లు చింపేశారు. మహిళల బొమ్మలు, విగ్రహాలను ధ్వంసం చేశారు. మహిళలు ఉన్న పోస్టర్లపై నల్లటి సిరాను పూశారు. మరికొన్ని కనిపించకుండా పరదాలు కప్పారు. దేశీయ టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లలో మహిళలు పనిచేయకూడదని నిషేధం విధించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, దేశం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న వారిని తాలిబన్లు దొరకబుచ్చుకొని చితకబాదుతున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉండగా.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాలిబన్లు చర్యలు మొదలుపెట్టారు. ఉద్యోగాల్లో చేరాలంటూ ఇంటింటికీ తిరుగుతూ పౌరులను బెదిరించడం కనిపిస్తున్నది.
బిడ్డలన్నా బాగుండాలని..
తాలిబన్ల పాలనలో కష్టాలు పడలేమని, అఫ్గానిస్థాన్ నుంచి ఎలాగైనా బయటపడాలని కాబూల్ విమానాశ్రయానికి వస్తున్న పౌరుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అయితే, ప్రజలను విమానాశ్రయంలోనికి వెళ్లనీయకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారు. చుట్టూ ఇనుప కంచెను వేశారు. ఎయిర్పోర్ట్ ప్రహారీ గోడ ఎక్కాలనుకున్న వారిపై కాల్పులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదుతున్నారు. ‘తాము అఫ్గాన్లో చిక్కుకుపోయినా పర్వాలేదు. తమ పిల్లలనైనా బయటకు పంపించండి’ అంటూ ఎయిర్పోర్ట్లోని అమెరికా, బ్రిటన్ దళాలను పలువురు తల్లిదండ్రులు ప్రాధేయపడటం కనిపిస్తున్నది. తమ తర్వాతి తరాలు స్వేచ్ఛగా బతుకాలన్న ఆశతో చిన్నారులను ఇనుప కంచెల నుంచి కొందరు తల్లులు అటువైపునకు విసిరేయడం అఫ్గాన్లో భీతావహ పరిస్థితులకు అద్దంపడుతున్నది. మరోవైపు, అఫ్గాన్లోకి ఇప్పటికే చొరబడిన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల సభ్యులు అక్కడి పౌరుల ఇండ్లల్లోకి చొరబడి అందినకాడికి దోచుకుపోతున్నారు.
ఆయుధ విక్రయాలపై అమెరికా నిషేధం
అఫ్గాన్కు ఆయుధ సామగ్రి విక్రయాలను నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న అఫ్గాన్ ప్రస్తుతం తమ నుంచి ఎలాంటి రుణాలు, సహాయాన్ని అందుకోలేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వెల్లడించింది.
‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’
గురువారం అఫ్గానిస్థాన్ 102వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాలిబన్ నేతలు కీలక ప్రకటన చేశారు. అఫ్గానిస్థాన్ను ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’గా మారుస్తున్నట్టు ప్రకటించారు. 1996-2001లో తాలిబన్లు అఫ్గాన్ను పాలించే సమయంలో ఆ దేశాన్ని ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’గా వ్యవహరించారు.
తాలిబన్లు గొప్ప యోధులు: ట్రంప్
తన వ్యాఖ్యలతో తరుచూ వివాదాల్లో చిక్కుకునే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబన్లను గొప్ప యోధులుగా అభివర్ణించారు. వాళ్లు తెలివైనవారని, మంచి సంధానకర్తలని, వెయ్యేండ్లుగా వాళ్లు గొప్ప పోరాటపటిమను ప్రదర్శించారని కొనియాడారు. మరోవైపు, తాలిబన్లు ప్రస్తుతం స్పష్టమైన దృక్పథంతో, సహేతుక పరిపాలన సమర్థతతో ఉన్నారని చైనా అభిప్రాయపడింది. ఇంకోవైపు, తాలిబన్లను ఎదుర్కొనేందుకు పశ్చిమ దేశాలు సహకారం అందించాలని పంజ్షిర్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ నాయకుడు అమద్ మస్సౌద్ విజ్ఞప్తి చేశారు. మహిళల హక్కులను పరిరక్షించడానికి సాయుధ బలప్రయోగం సరైన మార్గం కాదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు.
అఫ్గాన్కు చెందిన ఓ తల్లి తన కూతురునైనా కాపాడాలంటూ బ్రిటన్ సైనికుడికి బిడ్డను అందజేసిన దృశ్యం