మనీలా : ఫిలిఫ్పీన్స్లో టైఫూన్ తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షాలకు 31 మంది దుర్మరణం చెందగా.. లక్షలాది మంది జనం నిరాశ్రయులయ్యారు. వేలకోట్ల ఆస్తినష్టం సంభవించింది. పర్యాటక దేశమైన ఫిలిప్పిన్స్లో రాయ్ టైపూన్ విలయంతో అనేక అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గంటకు 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు వీయడంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. అనేక ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం నెలకొంది.
ముఖ్యంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్లో తుఫాను విధ్వంసం సృష్టించిందని అధికారులు తెలిపారు. భారీగా వరదలు ముంచెత్తడంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లిందని, ఊళ్లకు ఊళ్లు నీటమునిగాయి. అయితే, మరణాలకు సంబంధించి పూర్తిగా సమాచారం లేదని, ఇప్పటి వరకు 31 మంది వరకు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ ప్రధాన విపత్తు ప్రతిస్పందన ఏజెన్సీ మరణాలు తక్కువగానే ఉన్నాయని నివేదించింది. చెట్లు కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది.
ప్రతి మరణాన్ని జాగ్రత్తగా ధ్రువీకరించాలని సూచించింది. భారీ గాలులకు దినాగట్ దివుల్లో విద్యుత్, కమ్యూనికేషన్ల లైన్లు దెబ్బతినగా.. అధికారులు శనివారం నిలిపి వేశారు. ఆహారం, నీరు, తాతాల్కిక ఆశ్రయాలు, ఇంధన, వైద్య సామాగ్రి అందించాలని ప్రావిన్స్ గవర్నర్ అర్లీన్ బాగ్ ఆవో కోరారు. భారీ గాలులకు దినాగట్లో దాదాపు 95శాతం ఇండ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. అత్యవసర ఆశ్రయాలు కూడా ధ్వంసం కాగా.. అధికారులు మరమ్మతులు చేశారు.
బాధితులకు వసతి కల్పిద్దామన్నా చర్చిలు, పాఠశాలలు, పబ్లిక్ మార్కెట్లు తదితర అన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఫిలిప్పీన్స్ సర్ఫింగ్ రాజధానిగా పిలువబడే సమీపంలోని సియార్గావో ద్వీపం కూడా టైఫూన్తో కుప్పకూలింది. టైఫూన్తో నేరుగా దెబ్బతిన్న సెంట్రల్ బోహోల్ ప్రావిన్స్లో నీరు వేగంగా పెరగడంతో పైకప్పులు, చెట్లపై చిక్కుకున్న జనాన్ని రబ్బరు పడవల్లోని రక్షించినట్లు కోస్ట్ గార్డ్ సిబ్బంది చెప్పారు.