న్యూయార్క్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉన్నది. ట్విట్టర్ను చేజిక్కించుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. కంపెనీలో ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకోవాలనే పేరుతో ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 3400 మందిని ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా డబ్లిన్, సింగపూర్లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు డజనుకుపైగా ఉద్యోగులపై వేటువేస్తున్నట్లు వారం క్రితం వార్తలు వెలువడ్డాయి.
తాజాగా మరో 50 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తున్నది. వీరంతా ప్రొడక్ట్ విభాగంలో పనిచేస్తున్నారని, రానున్న వారాల్లో వీరిపై వేటు పడనున్నట్లు ఇన్సైడర్ అనే వార్తా సంస్థ తెలిపింది. కంపెనీ ఉద్యోగులను 2 వేల లోపు పరిమితం చేయాలని మస్క్ భావిస్తున్నట్లు పేర్కొన్నది. కాగా, వరుసగా నాలుగో వారం కూడా సంస్థ ఆదాయంలో 35 శాతం పడిపోయింది. ఇది 1.025 బిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమని వెల్లడించింది.