న్యూఢిల్లీ/శాన్ఫ్రాన్సిస్కో, నవంబర్ 7: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా భారత్లో గత వారం ఏకంగా 90% మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. వీరిలో ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రొడక్ట్ టీములకు చెందిన ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇంతకుముందు వరకు భారత్లో సుమారు 200 మంది ఉద్యోగులు ట్విట్టర్లో పనిచేసేవారు. ఇప్పుడు మస్క్ దెబ్బతో వీరి సంఖ్య దాదాపు డజనుకు తగ్గినట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ వ్యక్తి వెల్లడించారు. ట్విట్టర్తోపాటు మెటా, గూగుల్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీల అభివృద్ధికి భారత్ కీలకమైన చోదకంగా ఉన్నది. అధిక సంఖ్యలో కొత్త ఆన్లైన్ వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ సంస్థలు భారత్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ భారత్లో తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా కుదించడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
తప్పులు దొర్లాయ్.. తిరిగి ఆఫీసుకు రండి
ట్విట్టర్ నుంచి ఇటీవల తొలగించిన ఉద్యోగుల్లో కొందరిని తిరిగి ఆఫీసుకు రావాలని ఆ సంస్థ కోరుతున్నట్టు తెలుస్తున్నది. జాబితాలో తప్పులు దొర్లడం వల్ల పొరపాటున కొందరిని.. ఉద్యోగుల నైపుణ్యాన్ని, అనుభవాన్ని గుర్తించడంలో వైఫల్యం వల్ల మరికొందరిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వచ్చిందని పేర్కొంటూ వారికి ట్విట్టర్ యాజమాన్యం సందేశాలను పంపుతున్నట్టు ‘బ్లూమ్బర్గ్’ వెల్లడించింది. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం గానీ, ఆ సంస్థ కొత్త అధిపతి ఎలాన్ మస్క్ గానీ ఇంకా స్పందించలేదు. ట్విట్టర్కు నష్టాలొస్తున్నాయని పేర్కొంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ సంస్థలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారు.