అంకారా: హమాస్ పేరుతో పాలస్తీనాలోని గాజా (Gaza) స్ట్రిప్ను నామరూపాలు లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్పై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ (Tayyip Erdogan) మరోసారి విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్ (Israel) ఒక ఉగ్రవాద దేశమని (Terrorist state) అభివర్ణించారు. గాజాతోపాటు అక్కడి ప్రజలను సమూలంగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. గాజాలో అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తూ నేరాలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ దేశ రాజకీయ నాయకులు, సైనికాధికారులను అంతర్జాతీయ కోర్టులో దోషులుగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హమాస్ (Hamas) ఉగ్రవాద సంస్థ కాదని అది ఒక చట్టబద్ధమైన రాజకీయ శక్తి అన్నారు. పాలస్తీనా ప్రజలతో ఎన్నుకోబడిన రాజకీయ పార్టీ అని వెల్లడించారు. హమాస్ మిలిటెంట్లు పోరాట యోధులు. తమ ప్రాంతాన్ని, పౌరులను కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారని తెలిపారు. గాజాను, అక్కడి ప్రజలను నాశనం చేయాలని చూసే ఇజ్రాయెల్ ఉగ్రవాద దేశమేనని స్పష్టం చేశారు.
కాగా, ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Bejamin Netanyahu) స్పందించారు. ఉగ్రవాదులకు మద్దతు పలికే శక్తుల్లో టర్కీ అధ్యక్షుడు ఒకరని విమర్శించారు. ఇజ్రాయెల్ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన ఆయనే.. హమాస్ మిలిటెంట్లకు బాసటగా నిలుస్తున్నారని చెప్పారు. వారికి మద్దతుగా సొంత గ్రామాలపైనే బాంబు దాడులు చేసుకుంటున్న టర్కీ గురించి పెద్దగా మాట్లాడాల్సిందేమీ లేదన్నారు.