Turkish Airlines plane : ల్యాండింగ్ (Landing) సమయంలో విమానం చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం నేపాల్ (Nepal) రాజధాని ఖాఠ్మండు (Khatmandu) లోని త్రిభువన్ దాస్ (Tribhuvandas) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (International Airport) లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇస్తాంబుల్ నుంచి ఖాఠ్మండుకు వచ్చిన టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండవుతున్న సమయంలో కుడివైపు చక్రాలకు మంటలు అంటుకున్నాయి.
చక్రాల నుంచి దట్టమైన పొగ వచ్చింది. ఇక విమానం ల్యాండవగానే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ తలుపు నుంచి సురక్షితంగా కిందకు దించారు. ప్రమాద సమయంలో విమానంలో 277 మంది ప్యాసింజర్స్, 11 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన సిబ్బంది కూడా విమానంలో ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణమేంటో ఇంకా తెలియరాలేదు. ఎయిర్లైన్స్ కూడా ఈ ఉదంతంపై స్పందించాల్సి ఉంది.
త్రిభువన్ దాస్ ఎయిప్పోర్టులో గతంలో కూడా టర్కీ విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. 2015లో ల్యాండింగ్ సమయంలో ఒక విమానం బ్యాలెన్స్ తప్పి రన్వేపై నుంచి జారీ పక్కకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఎయిర్పోర్టును నాలుగు రోజుల పాటు మూసేయాల్సి వచ్చింది.