Turkey Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో మృత్యహేళ కొనసాగుతున్నది. ఆ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంప ప్రభావిత ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారిపోయాయి. కూలిన భవన శిథిలాలను తొలగించినా కొద్ది మృతదేహాలు బయట పడుతున్నాయి. మృతుల సంఖ్య కాలంతో పోటీపడి పెరుగుతున్నది.
రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన భూకంప మృతుల సంఖ్య 11,236కు చేరింది. అందులో టర్కీలో మరణించిన వారు 8,574 కాగా, సిరియా మృతులు 2,662 మంది ఉన్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాలకు చెందిన సహాయక బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి.
ఎముకలు కొరికే చలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. దాంతో రెస్క్యూ బృందాలు, స్థానికులు వెచ్చదనం కోసం చుట్టుపక్కలున్న చెత్తను పోగేసి నిప్పుపెడుతున్న దృశ్యాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. భారత్ నుంచి కూడా రెండు వాయుసేన విమానాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రత్యేక తర్ఫీదు పొందిన డాగ్ స్క్వాడ్ టర్కీకి తరలివెళ్లాయి. ప్రస్తుతం ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.