తుర్కియే, సిరియాలో ప్రకృతి విలయం సృష్టించింది. గంటల వ్యవధిలో సంభవించిన మూడు వరుస భూకంపాలతో రెండు దేశాలూ చిగురుటాకులా వణికిపోయాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇరు దేశాల్లో 2,600 మందికిపైగా దుర్మరణం చెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంప విలయంపై ప్రపంచదేశాలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలను పంపాలని భారత్ నిర్ణయించింది.
తెల్లవారుజాము 4.17 గంటల సమయం. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా భారీ కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకొనేలోపే భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. నిద్రలోనే వందల మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకొన్నారు. భూకంపం ధాటికి తుర్కియే, సిరియా మరుభూమిని తలపించాయి. గంటల వ్యవధిలో సంభవించిన మరో రెండు భూకంపాలు పరిస్థితులను మరింత దిగజార్చాయి.
అంకారా/అజ్మేరిన్, ఫిబ్రవరి 6: ప్రకృతి ప్రకోపించింది. తుర్కియే, సిరియాపై విరుచుకుపడింది. గంటల వ్యవధిలో సంభవించిన మూడు వరుస భూకంపాలతో రెండు దేశాలూ చిగురుటాకులా వణికిపోయాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇరు దేశాల్లో 2,600 మందికి పైగా మరణించగా, వేలాది మందికి గాయాలయ్యాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. భూప్రకంపనల ధాటికి దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాల్లోని పలు నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి.
24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు చోటుచేసుకొన్నాయి. మొదట రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో తెల్లవారుజాము 4.17 గంటల సమయంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రత నమోదైంది. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో (రిక్టర్స్కేల్పై 7.5) తుర్కియేలోని ఎకినోజు ప్రాంతంలో, సాయంత్రం ఆరు గంటల సమయంలో (రిక్టర్ స్కేల్పై 6.0) సెంట్రల్ తుర్కియే ప్రాంతంలో భూకంపాలు సంభించాయి. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. 50కి పైగా స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకొన్నట్టు భూకంప అధ్యయన కేంద్రాలు వెల్లడించాయి.
తుర్కియేలోని ఆదానా, దియార్బకిర్, గాజియాన్తెప్ తదితర నగరాలతో పాటు, సిరియాలోని అలెప్పో, హయా, డమాస్కస్, లటాకియా ఇతర నగరాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. తుర్కియేలోని పది ప్రావిన్స్లలో 1,650 మందికి పైగా మరణించగా, 8,500 మందికి పైగా గాయాలయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు సిరియాలో ప్రభుత్వ అధీనంలోని ప్రాంతాల్లో 430 మరణాలు నమోదు కాగా, 1,280 మందికిపైగా గాయాలయ్యాయి. సిరియాలో రెబల్స్ అధీనంలోని ప్రాంతాల్లో 380 మంది మరణించారు. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 2,800 బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్టు తుర్కియే ఉపాధ్యక్షుడు ఫుయత్ ఒక్తే వెల్లడించారు.
భారీ భూకంపం నేపథ్యంలో హృదయ విదారకర దృశ్యాలు కనిపించాయి. ప్రజల ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇండ్లు కూలిపోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపైకి రావొద్దని అధికారులు సూచనలు చేశారు. ఇండ్లు దెబ్బతిన్న వారికి ఆశ్రయం కల్పించేందుకు చుట్టుపక్కల మసీదుల్లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు.
భూకంప విలయంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. తుర్కియే, సిరియా దేశాలకు ఆర్థిక, వైద్యపరమైన సాయం చేసేందుకు భారత్తో సహా పలు దేశాలు ముందుకు వచ్చాయి. సహాయక చర్యల్లో పాలుపంచుకొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణం ప్రభావిత ప్రాంతాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. వైద్య బృందాలు, రిలీఫ్ మెటీరియల్ పంపనున్నట్టు అధికారులు తెలిపారు. అమెరికా, చైనా, ఈయూ, బ్రిటన్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇటలీ, ఇజ్రాయెల్, స్పెయిన్, ఖతర్, తదితర దేశాలు సహాయక సామగ్రి పంపిస్తామని ప్రకటించాయి.
తుర్కియే వరుస భూకంపాల బారిన పడుతూనే ఉంటున్నది. తాజా భూకంపాన్ని ఓ శాస్త్రవేత్త మూడు రోజుల ముందే అంచనా వేయడం గమనార్హం. అతిత్వరలో లేదా కొద్ది రోజుల్లో రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రతతో దక్షిణ మధ్య తుర్కియే, సిరియా రీజియన్లో భూకంపం సంభవిస్తుంది’ అని భూకంపాలపై అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే(ఎస్ఎస్జీఈఓఎస్) పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ అంచనా వేస్తూ ఈ నెల 3న ట్వీట్ చేశారు. అయితే కొంత మంది ట్విట్టర్ యూజర్లు ఫ్రాంక్ ముందస్తు అంచనాలను కొట్టిపారేస్తూ.. నకిలీ శాస్త్రవేత్త అంటూ నిందించారు.