అదానా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో దాదాపు 6,200 మంది మరణించినట్టు అధికారిక, మీడియా వర్గాలు వెల్లడించాయి. తుర్కియేలో 4,500 మందికి పైగా మృత్యువాత పడ్డారని, 21 వేల మందికి పైగా గాయాలయ్యాయని ఆ దేశ ఉపాధ్యక్షుడు ఫుయత్ ఒక్తే తెలిపారు.
సిరియాలోని ప్రభుత్వ అధీన ప్రాంతాల్లో 800 మందికిపైగా, రెబల్స్ అధీన ప్రాంతాల్లో 1020 మంది మరణించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూలిన భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకొన్న వారి కోసం వెతుకులాట కొనసాగుతున్నది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తున్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులతో దవాఖానలు నిండిపోయాయి. వైద్య సిబ్బంది అవిశ్రాతంగా పనిచేస్తున్నారని సిరియాకు చెందిన డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ మిషన్ హెడ్ సెబాస్టియన్ పేర్కొన్నారు.
ఇండ్లు కూలిపోవడంతో వేలాది మంది తాత్కాలిక శిబిరాలాల్లో తలదాచుకొంటున్నారు. మూడు తీవ్ర భూకంపాలతో పాటు రెండు దేశాల్లో దాదాపుగా 200 ప్రకంపనలు చోటుచేసుకొన్నట్టు భూకంప అధ్యయన కేంద్రాలు వెల్లడించాయి. భూకంపం ధాటికి రెండు దేశాల్లో 20 వేల మందికిపైగా మృత్యువాతపడి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేసింది. పెను విపత్తు నేపథ్యంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ మూడు నెలల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు.
ప్రపంచ దేశాల చేయూత
భారత్లో సహా పలు ప్రపంచదేశాలు ఇప్పటికే భూకంప ప్రభావిత తుర్కియే, సిరియాలకు అండగా నిలిచాయి. రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్ తక్షణంగా పంపించాయి. భారత్ రెండు విమానాల్లో రిలీఫ్ మెటీరియల్, వైద్య, రెస్క్యూ సిబ్బందిని తుర్కియేకు పంపింది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ అండగా ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.