వాషింగ్టన్ : సుంకాల తగ్గింపులు, ఆంక్షల ఉపశమనంపై చర్చలు ప్రారంభిస్తూనే ఇరాన్లో యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయడానికి అమెరికా ఒత్తిడి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఇరాన్లో ఫలవంతమైన పాలన మార్పునకు రెండు వారాల కాల్పుల విరమణ నాంది పలికిందని ట్రంప్ తెలిపారు. యుద్ధం అనంతరం ఇరాన్తో అమెరికా సన్నిహితంగా పనిచేస్తుందని ఆయన బుధవారం ట్రూత్ సోషల్ పోస్టులో తెలిపారు. విస్తృత ఒప్పందంలోని కీలక అంశాలు ఇప్పటికే ఖరారయ్యాయని కూడా ఆయన పేర్కొన్నారు. యురేనియం శుద్ధి జరగదు. ఇరాన్తో అమెరికా కలసి పనిచేసి భూమిలోత్లులో పాతుకుపోయిన అణు ధూళి మొత్తాన్ని తవ్వి తొలగిస్తుంది అని ఇరాన్ అణు మౌలిక సదుపాయాల అవశేషాలను ప్రస్తావిస్తూ ట్రంప్ పేర్కొన్నారు. ఆ ప్రదేశాలు కఠినమైన ఉపగ్రహ నిఘాలో ఉన్నాయని, దాడి జరిగిన తేదీ నుండి ఏదీ అక్కడకు చేరుకోలేదని కూడా ఆయన తెలిపారు.
తదుపరి దశ చర్చల్లో ఆర్థిక చర్యలు కీలకంగా ఉంటాయని ట్రంప్ సూచించారు. సుంకాలు, ఆంక్షలను సడలించడంపై ఇరాన్తో చర్చలు ఇప్పటికే జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. 15 అంశాల్లో చాలావాటిని ఇప్పటికే అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే ప్రతిపాదిత ప్రణాళిక గురించి ఆయన వివరించలేదు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై అమెరికాకు ఎగుమతి చేసే సరకులపై 50 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని, ఎటువంటి మినహాయింపులు, తీసివేతలు ఉండబోవని ఆయన మరో పోస్టులో పేర్కొన్నారు.
కాల్పుల విరమణ కోసం ఇరాన్ నాయకత్వం తమను వేడుకుందని అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. ఇరాన్ నాయకత్వం బలహీనపడి, అవమానాలతో సైనిక సామర్థ్యాలు దెబ్బతిన్న తర్వాతే.. చర్చలకు ఇరాన్ రావాల్సి వచ్చిందని హెగ్సెత్ చెప్పారు. ఇరాన్కు ఎక్కడా కూడా మరో ఆప్షన్, సమయం రెండూ లేవని, అందువల్లే రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిందని ఆయన అన్నారు. ట్రంప్ సీజ్ఫైర్ ప్రకటన తర్వాత హెగ్సెత్ విలేకర్లతో మాట్లాడారు. ఇరాన్కు మరో ఆప్షన్, టైమ్ ఎక్కడా లేనందున.. కాల్పుల విరమణ కోసం అమెరికాను వేడుకుంది. అమెరికాతో ఒప్పందం చేసుకోవటమే మేలైందని ఇరాన్లోని కొత్త నాయకత్వం తెలుసుకుంది’ అని చెప్పారు.