Donald trump : యుద్ధం సందర్భంగా ఇరాన్ (Iran) లోని బాలికల పాఠశాల (Girls School) పై జరిగిన వైమానిక దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఫ్రాన్స్ (France) లో జరుగుతున్న జీ-7 సదస్సు (G-7 Summit) లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యుద్ధంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని, దీన్ని ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయలేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటనకు బాధ్యతపై అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్లోని మినాబ్లో ఉన్న షజారా తయ్యేబే ప్రాథమిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 170 మందికి పైగా మరణించారు. వారిలో అత్యధికులు చిన్నారులే కావడం గమనార్హం.
ఈ దారుణం జరిగి 100 రోజులు గడిచినప్పటికీ దీనిపై పెంటగాన్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ట్రంప్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలు ప్రారంభమైన మొదటి రోజే ఈ దాడి చోటుచేసుకుంది. పాత నిఘా సమాచారం ఆధారంగా అమెరికా ప్రయోగించిన తోమాహాక్ క్షిపణి, పొరపాటున పాఠశాలపై పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఘటన జరిగిన తొలినాళ్లలో ఇరాన్ ఆయుధాల వైఫల్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. కానీ అక్కడ అమెరికా క్షిపణి అవశేషాలు లభించడంతో ఆ వాదన తప్పని స్పష్టమైంది.
ఈ దాడికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నను ట్రంప్ ‘వింతైనది’గా అభివర్ణించారు. యుద్ధం అనేది చాలా క్రూరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్బంలో జరిగే ఘటనలకు బాధ్యులు ఎవరు అని అడగడం ఒక వింత అని ఎద్దేవా చేశారు. కాగా దాడి ఘటనపై పారదర్శక విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని అమెరికా సెనేట్లోని సభ్యులు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అయినప్పటికీ జీ-7 సదస్సులో దర్యాప్తు పురోగతికి సంబంధించి ట్రంప్ ఎలాంటి కొత్త వివరాలను వెల్లడించలేదు.