Donald Trump : ఇరాన్, అమెరికా మధ్య రెండో దఫా చర్చలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి దశ సమావేశం విఫలమవ్వడంతో పాటు హర్మూజ్ జలసంధి(Hormuz Strait)ని ఇరాన్ మూసి వేసిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో రెండోసారి చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని పేర్కొన్న ట్రంప్ శాంతి చర్చల కోసం తన ప్రతినిధుల బృందం పాకిస్థాన్కు వెళ్తోందని వెల్లడించారు. ఆదివారం ట్రుత్ సోషల్ వేదికగా అమెరికా అధినేత ‘మేము రెఢీ.. మీ సంగతేంటీ. ఈసారి ఒప్పందం కుదరకుంటే వినాశనమే’ అని ఇరాన్ను హెచ్చరించారు.
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మళ్లీ చర్చల ఊసెత్తారు. ఇస్లామాబాద్లో వారం క్రితం జరిపిన మొదటి విడత చర్చలు విఫలమవ్వడం, హర్మూజ్పై ఇరాన్ మళ్లీ ఆంక్షలు విధించడంతో ట్రంప్ మాట్లడుకుందాం రండి అని ఆహ్వానిస్తూనే బెట్టు చేశారంటే నాశనం చేస్తామని హెచ్చరించారు.
‘హర్మూజ్ జలసంధిలో కాల్పులు జరపాలని శనివారం ఇరాన్ నిర్ణయించుకుంది. ఇది పూర్తిగా కాల్పుల విరమణ ఉల్లంఘన. ఫ్రాన్స్ నౌకలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఇది మంచిది కాదు. నా ప్రత్యేక ప్రతినిధులు పాకిస్థాన్కు వెళ్తున్నారు. వారు రేపు సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకుంటారు. అయితే.. ఇరాన్ తామ్ హర్మూజ్ను మూసేస్తామని ప్రకటించింది. కానీ, అంతకంటే ముందే మా యుద్ధ నౌకలు హర్మూజ్ను దిగ్భందించాయి. ఇరాన్ తీరుతోనే రోజుకు 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. అమెరికాకు ఏమీ నష్టం లేదు. ఇప్పటికే చాలా నౌకలు టెక్సాస్, లూసీయానా, అలస్కా ప్రాంతాలకు చేరుకుంటున్నాయి.

చర్చల కోసం నా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు వెళ్తున్నారు. వారు రేపు(సోమవారం) సాయంత్రం అక్కడికి చేరుకుంటారు. ఈసారి మేము ఇరాన్కు ఆమోదయోగ్యమైన .. సహేతుకమైన డీల్ ఇస్తున్నాం. వారు అందుకు అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నా. ఒకవేళ వారు అంగీకరించకుంటే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జ్లను అమెరికా నాశనం చేస్తాం. ఇకపై నేను మంచి వ్యక్తిలా ఉండను. ఐఆర్జీసీ ప్రతినిధులు త్వరగా మాతో అంగీకారానికి రావాలి. వారు గనుక మా ప్రతిపాదనల్ని తిరస్కరిస్తే.. ఇకపై జరిగింది, జరగబోయేది నేను చూసుకుంటా. ఇరాన్లో హత్యల యంత్రం శకం ముగిసే సమయం వచ్చేసింది’ అని ట్రంప్ హెచ్చరించారు.