శర్మ్ ఎల్ షేక్: భారత్పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump). ప్రధాని మోదీ పేరును నేరగా చెప్పకుండానే ఆయన్ను కూడా మెచ్చుకున్నారు. ఇజ్రాయిల్ పార్లమెంట్లో ప్రసగించిన తర్వాత ఈజిప్టులో జరిగిన ప్రపంచ దేశాధినేతల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. వేదికపై తన వెనుక నిలబడ్డ పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ను పలకరిస్తూనే ఇండియాపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత్ గొప్ప దేశమని, నా మిత్రుడు గొప్ప స్థాయిలో ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్థాన్, భారత్ కలిసి మెలిసి మంచిగా జీవిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. భారత ప్రధాని అద్భుతమైన పని చేశారని అన్నారు. షరీఫ్ను పలకరిస్తూ ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
#WATCH | Egypt | US President Donald Trump says, “India is a great country with a very good friend of mine at the top and he has done a fantastic job. I think that Pakistan and India are going to live very nicely together…”
(Video source: The White House/YouTube) pic.twitter.com/rROPW57GCO
— ANI (@ANI) October 13, 2025
ట్రంప్ పలకరించిన సమయంలో షరీఫ్ నవ్వలేక నవ్వారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ను ఫెవరేట్ ఫీల్డ్ మార్షల్ అని ట్రంప్ పొగిడారు. ఆ సమావేశంలో మాట్లాడేందుకు పాక్ ప్రధానిని కూడా ఆయన ఆహ్వానించారు. పశ్చిమాసియాలో శాంతి వెల్లువిరిసిందని, దీంట్లో ట్రంప్ కృషి విశేషంగా ఉన్నట్లు షరీఫ్ తెలిపారు. నోబెల్ శాంతి పురస్కారం కోసం డోనాల్డ్ ట్రంప్ను మళ్లీ నామినేట్ చేయడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని షరీఫ్ చెప్పారు. దక్షిణాసియాతో పాటు పశ్చిమాసియాలో లక్షలాది మందిని ఆయన రక్షించారన్నారు. నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. తాను 8 యుద్ధాలను ఆపాలని, దాంట్లో ఇండోపాక్ వార్ కూడా ఉందని, కానీ ఇవన్నీ నోబెల్ అవార్డు కోసం చేయలేదన్నారు.