కొలంబో, ఏప్రిల్ 28: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్సతో పాటు ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు వెయ్యి కార్మిక సంఘాలు గురువారం ఒక్కరోజు సమ్మె చేపట్టాయి. ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో విఫలమైన గొటబయ ప్రభుత్వం తక్షణం అధికారం నుంచి తప్పుకోవాలని నినదించారు. ఇందుకు వారం రోజుల సమయం ఇస్తున్నామని, ఆ తర్వాత గొటబయ ప్రభుత్వం దిగిపోయే వరకు నిరవధికంగా సమ్మె చేస్తామని హెల్త్ వర్కర్ కార్మిక సంఘం ప్రతినిధి రవి కుముదేశ్ హెచ్చరించారు. ‘ప్రజలకు తలవంచి.. ప్రభుత్వం ఇంటికి పోవాలి’ అనే నినాదంతో వైద్య, విద్యుత్తు, విద్య, రవాణా, బ్యాంకింగ్, పోస్టల్, పోర్టులు తదితర రంగాల కార్మికులు ఈ ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతో జనజీవనం, ప్రజారవాణా స్తంభించింది. వ్యాపారాలు మూతబడ్డాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నా.. రాజపక్స ప్రభుత్వం అధికారం పట్టుకొని వేలాడుతున్నదని ఉపాధ్యాయ సంఘాల నేత జోసెఫ్ స్టాలిన్ విమర్శించారు.