డెస్ మోయిన్స్: అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం సృష్టించింది. నాలుగు రోజుల క్రితమే దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన టోర్నడో తాజాగా మిస్సోరి ఆగ్నేయ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ ధాటికి పలువురు మృతి చెందగా, చాలా మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. సెయింట్ లూయిస్ దక్షిణ ప్రాంతానికి 50 మైళ్ల దూరంలోని బొలింగర్ కౌంటీ మీదుగా బుధవారం ఉదయం 3.30-4.00 గంటల మధ్య తుఫాన్ పయనించినట్టు వారు చెప్పారు. అయితే ఎంతమంది మరణించారో, ఎంతమంది గాయపడ్డారో ఇప్పుడే చెప్పలేమన్నారు. తుఫాన్ అనంతర దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయని పేర్కొన్నారు.