Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 17 వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి. ఒక్క తుర్కియేలోనే 14,014 మంది మరణించగా.. సిరియాలో 3,162 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 17,176 మంది మృత్యువాత పడినట్లు వెల్లడించాయి.
మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని 24 దేశాలకు చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. తుర్కియేలో భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద వేల మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం సహాయక చర్యలకు వాతావరణం అనుకూలించట్లేదని స్థానిక అధికారులు వెల్లడించారు. రెండు దేశాల్లో గడ్డకట్టే వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతోందని అధికారులు తెలిపారు. టర్కీ అధ్యక్షుడు భూకంప ప్రభావిత ప్రాంతానికి చేరుకుని.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.