హైదరాబాద్ : దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..దుబాయ్లోని అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రోడ్డుపై సోమవారం వేగంగా వస్తున్న మినీబస్సు ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హాస్పిటల్కు తరలించారు. మృతులను జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలానికి చెందిన అబ్దుల్ రఫీక్, కొడిమ్యాల మండలానికి చెందిన సయ్యద్ సలీం, మల్యాల మండలానికి చెందిన గజుల తిరుపతిగా గుర్తించారు.
గాయపడిన వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ సయీద్ కూడా ఉన్నాడు. వీరందరూ షార్జా కేంద్రంగా పని చేస్తున్న అల్యూమినియం గ్లాస్, డోర్ ఫ్రేమ్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న భారత కాన్సులేట్ అధికారులు బాధితులను పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.