న్యూయార్క్: అమెరికాలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు, హంతకులు ఉన్నట్లు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశాధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న డ్రగ్ కార్టల్స్ను విదేశీ ఉగ్ర సంస్థలుగా అభివర్ణించారు. హౌతీ రెబల్స్ను కూడా తీవ్రవాద గ్రూపుగా ట్రంప్ పేర్కొన్నారు.
దేశంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని, వేల వేల సంఖ్యలో హంతకులు కూడా ఉన్నారని, వారందర్నీ అణిచివేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం 11 వేల మంది హంతకులు జీవిస్తున్నట్లు చెప్పారు. దాంట్లో 48 శాతం మంది.. ఒకరి కన్నా ఎక్కువ మందిని హతమార్చినట్లు ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో జైళ్లలో ఉన్న వారు అమెరికాకు వచ్చేస్తున్నట్లు తెలిపారు. వెనిజులాలో క్రైం రేటు 78 శాతం తగ్గినట్లు ట్రంప్ చెప్పారు. విదేశాల్లోని వీధి గ్యాంగ్లు ఇప్పుడు అమెరికాకు వచ్చేశాయని, ఆ ముఠాల ఆగడాలను కొలరాడో, లాస్ ఏంజిల్స్లో చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
పీవ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. అమెరికాలో 40 లక్షల మంది మెక్సికన్లు అక్రమంగా జీవిస్తున్నారు. 2022లో సరిహద్దు ద్వారా సుమారు లక్షన్నర మంది మెక్సికన్లు అమెరికాలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అమెరికాకు వలస వెళ్తున్న వారిలో భారత్, చైనా, వెనిజులా, క్యూబా, బ్రేజిల్, కెనడా దేశస్థులు ఉన్నారు.