బీజింగ్, డిసెంబర్ 27: కరోనా కేసులతో చైనా ప్రజలు విలవిలలాడుతుంటే అక్కడి ప్రభుత్వం కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తేసే పనిలో నిమగ్నమైంది. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలను తొలగించాలని తాజాగా నిర్ణయించింది. జనవరి 8 నుంచి చైనాకు అంతర్జాతీయ రాకపోకలపై ఉన్న నిబంధనలను ఎత్తేస్తున్నట్టు నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. చైనాకు వచ్చే వారు ఇకపై కేవలం కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుంది. ఇన్ని రోజులు కరోనా వ్యాప్తి అడ్డుకట్టపై దృష్టి పెట్టిన చైనా..ఇప్పుడు దాని కంటే బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించటంపైనే దృష్టి పెట్టింది. రిటైర్డ్ వైద్యులు, సిబ్బందిని కూడా విధుల్లోకి తీసుకొంటున్నది. ఇంతకాలం సగటున 10 వేల మందికి 4 ఐసీయూ బెడ్లు ఉంటే నెలలో 10కు పెంచింది.