Iran Israel War | ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది.తమపై క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. తమ సుప్రీం లీడర్ ఖమేనిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అనంతరం ఇజ్రాయెల్ వార్నింగ్కు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇది శాంపిల్ మాత్రమేనని.. అసలు దాడులు త్వరలోనే ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ హెచ్చరించారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని ప్రకటించారు.
ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని ఆయన అన్నారు. దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్లోని నిరంకుశ పాలనను అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించారు.
ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ చర్యలు మొత్తం మధ్య ఆసియానే ప్రమాదంలోకి నెట్టేసిందని అన్నారు. మధ్య ఆసియా మొత్తాన్ని యుద్ధంలోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దీనికి ఇరాన్కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పోరాడతాం.. కచ్చితంగా గెలిచి తీరుతామని వ్యాఖ్యానించారు.
ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇరాన్పై విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ వైపు నుంచి 180 మిసైల్స్ వచ్చాయని.. వీటిలో దాదాపు అన్నింటినీ నిర్వీర్యం చేశామని ప్రకటించారు. ఈ క్షిపణుల్లో కొన్ని భూమిపైకి చేరుకుని విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ఏ స్థాయిలో నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇరాన్ క్షిపణుల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆ దేశవ్యాప్తంగా సైరన్ల మోత వినిపిస్తోంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.