పారిస్, నవంబర్ 19: యూరప్ కాలజ్ఞానిగా పేరొందిన నోస్ట్రడామస్.. హిట్లర్ అధికారంలోకి రావడం గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి ముందుగానే ఊహించాడని చాలా మంది విశ్వసిస్తారు. సెప్టెంబర్ 11 దాడులను, ఫ్రెంచ్ విప్లవాన్ని, కెనెడీ హత్యను కూడా ఆయన ముందుగానే ఊహించినట్టు చెప్పుకొంటారు. ఫ్రాన్స్లో 1502లో జన్మించి 1566లో కన్నుమూసిన నోస్ట్రడామస్ ‘లె ప్రాఫెసీస్’ అనే పేరుతో కాలజ్ఞాన గ్రంథం రాశాడు. అందులో అన్నీ కూడా మరుగుభాషలో చెప్పడం గమనార్హం. ఆయన మాటలకు ఎవరికి తోచిన విధంగా వారు అర్థాలు తీసుకుంటూ పోవడం జరుగుతుంది. ఆయన రాసిందాంట్లో 70 శాతం నిజమయ్యాయనే సిద్ధాంతాలూ ఉన్నాయి.
కరోనా మహమ్మారి గురించి కూడా ఆయన కచ్చితంగా అంచనా వేశాడని ఆ మధ్య చర్చ జరిగింది. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి నోస్ట్రడామస్ జోస్యాలపై చర్చ జరుగుతున్నది. 2023లో మహాయుద్ధం సంభవిస్తుందని ఆయన రాశాడు. దుర్బుద్ధితో మొదలైన ఆ యుద్ధంలో ప్రజలు పెద్దసంఖ్యలో మరణిస్తారని నోస్ట్రాడమస్ చెప్పాడు. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి రాసిందని, మూడవ ప్రపంచ యుద్ధానికి అది దారితీస్తుందనే జోస్యంగా అర్థం తీస్తున్నారు. ఇంకా విశ్వ వినాశనం జరిగి నూతన వ్యవస్థ అందులోంచి ఆవిర్భవిస్తుందని నోస్ట్రడామస్ చెప్పాడని ఊహాగానాలు సాగుతున్నాయి.