Indonesia Football Match Tragedy | ఇండోనేసియా ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. తమ జట్టు మ్యాచ్లో ఓడిపోయిందని ఫ్యాన్స్ చూపించిన అసహనం.. రక్తపాతానికి దారితీసింది. 174మందిని బలి తీసుకుంది. తూర్పు జావాలో శనివారం రాత్రి జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత జరిగిన ఈ విషాదం ఒక్కసారిగా క్రీడాభిమానులు ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఫుట్బాల్ స్టేడియంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే కొత్తేమీ కాదు.. గత 40 ఏండ్లలో ఎన్నో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం..
2022 మార్చి : కేరళలోని మలప్పురంలోని ఓ స్టేడియంలో ఆలిండియా ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో గ్యాలరీ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాలరీ సామర్థ్యాన్ని మించి ఫ్యాన్స్ ( సుమారు 8వేల మంది ) రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
2022 జనవరి : కామెరూన్లోని యోండె ఒలెంబె స్టేడియం వద్ద జరిగిన హింసాకాండలో 8 మంది మరణించారు. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ మ్యాచ్ను వీక్షించేందుకు స్టేడియానికి భారీగా ఫ్యాన్స్ వచ్చారు. స్టేడియంలోకి ప్రవేశించే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా.. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2012 ఫిబ్రవరి : ఈజిప్టియన్ సాకర్ లీగ్లో భాగంగా అల్ మశ్రి, అల్ అహ్లెయ్ జట్ల మధ్య పోర్ట్ సిటీలో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య చెలరేగిన వివాదం హింసాకాండకు దారితీసింది. ఈ ఘటనలో 73 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.
2009 మార్చి : ఐవరీ కోస్ట్లోని అబిడ్జన్ ఫెలిక్స్ హోఫౌట్ స్టేడియంలో వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు తొక్కిసలాట జరిగి 19 మంది దుర్మరణం చెందారు.
2001 మే : ఘనాలోని ఆక్రా మెయిన్ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన హింసాకాండ.. ఆఫ్రికా ఫుట్బాల్ చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా చెప్పొచ్చు. ఆ సమయంలో ఆందోళన చేస్తున్న ఫ్యాన్స్ను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 120 మంది మరణించారు.
2001 ఏప్రిల్ : దక్షిణాఫ్రికా జోహెన్నెస్బర్గ్లోని ఎల్లిస్ పార్క్ స్టేడియంలో సౌతాఫ్రికా లీగ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. అభిమానులు స్టేడియంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 43 మంది దుర్మరణం చెందారు.
1996 అక్టోబర్ : గౌటెమల సిటీలో గౌటెమల, కోస్టారికా మధ్య వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫ్యాన్స్ మధ్య చెలరేగిన వివాదం.. దాదాపు 80 మందిని బలితీసుకుంది.
1992 : ఫ్రాన్స్లోని బస్టియా ఫురియాని స్టేడియంలో ఫ్రెంచ్ కప్ సెమీ ఫైనల్ జరుగుతున్న సమయంలో ఒక్కడే ఉన్న ఒక స్టాండ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందగా.. రెండు వేల మందికిగా పైగా గాయపడ్డారు.
1991 జనవరి : సౌతాఫ్రికాలోని ఒప్పెన్స్ హైమర్ స్టేడియంలో కైజర్ చీఫ్స్, ఒర్లాండో పైరెట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో చీప్స్ అభిమానులపై.. పైరెట్స్ ఫ్యాన్ కత్తితో దాడి చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి 42 మంది మరణించారు.
1989 ఏప్రిల్ : ఎఫ్ఏ కప్ సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్లోని హిల్స్బర్గ్ స్టేడియంలో లివర్పూల్, నాటింగ్హమ్ ఫారెస్ట్ జట్లు తలపడ్డాయి. ఆ రసవత్తరమైన ఫైట్ను చూడాలని పెద్ద ఎత్తున ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు. సామర్థ్యానికి మించి వచ్చిన అభిమానులు స్టేడియంలో చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగి 97 మంది దుర్మరణం చెందారు.
1988 మార్చి : నేపాల్ ఖాట్మండూలోని నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో మంచు తుఫాను విజృంభించింది. దీంతో స్టేడియం నుంచి అభిమానులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి 90 మంది మృతిచెందారు.
1985 మే : బెల్జియం రాజధాని బ్రసెల్స్లోని హెయ్సెల్ స్టేడియంలో యూరోపియన్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా జువెంటస్, లివర్పూల్ జట్లు తలపడ్డాయి. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య చెలరేగిన వివాదం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ఘటనలో 39 మంది మరణించగా.. 600 మంది గాయపడ్డారు.
1985 మే : బ్రిటన్లోని బ్రాండ్ఫోర్డ్లోని వాలీ పరేడ్ స్టేడియంలో లింకన్ సిటీతో థర్డ్ డివిజన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేడియంలో ఉన్న స్టాండ్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఫ్యాన్స్ భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 56 మంది మృతిచెందారు. 200 మంది గాయపడ్డారు.
ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 174 మంది దుర్మరణం