హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లకు బ్లూ టిక్ ఉండేది. ఇప్పుడు ఆ టిక్ మార్క్ను తీసేశారు. అయితే బ్లూ టిక్ను కొనుగోలు చేసిన వాళ్లకు ఆ మార్క్ను ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయినవాళ్లలో ఎక్కువ మంది సెలబ్రిటీలు ఉన్నారు. కేవలం సెలబ్రిటీల కోసమే బ్లూ టిక్ ఐడెండిటీ అవసరమా అన్న ఆలోచన ఉండేది. అయితే ఇటీవల మస్క్ తీసుకున్న నిర్ణయం ట్విట్టర్ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది. ఇన్నాళ్లూ బ్లూ టిక్ ఉంటే, అది అఫిషియల్ అకౌంట్ అన్న ఐడెంటిటీ ఉండేది. ఇప్పుడు ఆ బ్లూ టిక్ను ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఆ టిక్ అందరికీ అందుబాటులో ఉన్నట్లే. మరి ఫేక్ ఏదో రియల్ ఏదో చెప్పడం కష్టమే.
ట్విట్టర్ వెరిఫికేషన్ సిస్టమ్లో జరుగుతున్న మార్పులు .. వాటి యూజర్లను తికమకపెడుతున్నాయి. ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఆ ప్రక్రియ మరీ వేగంగా సాగుతోంది. కానీ ప్రతి ఒక్కరినీ సమానంగా ట్రీట్ చేయడమే తమ ఉద్దేశమని ఇటీవల బ్లూ టిక్ వెరిఫికేషన్ గురించి మస్క్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సెలబ్రిటీలకు మరో ప్రమాణం అవసరం లేదని ఆయన అన్నారు.
We will continue to remove illegal content and suspend bad actors from our platform. We’re committed to increasing transparency around our moderation actions, and we’ll continue to share updates on our progress. You can learn more about our various enforcement actions here:…
— Twitter Safety (@TwitterSafety) April 17, 2023
పెయిడ్ ఫీచర్ ద్వారా తన రెవన్యూను పెంచుకోవాలని మస్క్ ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు ట్విట్టర్ను అధికారిక మీడియాలా వాడుకుంటున్నాయి. అమెరికా, రష్యా, చైనా, భారత్తో పాటు అన్ని మేజర్ దేశాల ప్రభుత్వాలు ట్విట్టర్ ఆధారంగా తమ సమాచారాన్ని ప్రజలుకు చేరవేస్తున్నాయి. ప్రస్తుతం పెయిడ్ విధానం అనుసరించడం వల్ల ట్విట్టర్ తమ ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్విట్టర్ను మస్క్ 44 బిలియన్ల డాలర్లకు ఇటీవల కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ అప్పుల నష్టాన్ని పూడ్చేందుకు మస్క్ పెయిడ్ ఫీచర్ ఇంట్రడ్యూస్ చేసినట్లు కూడా చెబుతున్నారు.
బ్లూ టిక్ను కొనడం వల్ల.. స్పామ్, స్కామ్ అకౌంట్లను కంట్రోల్ చేయవచ్చు అని మస్క్ గతంలో అభిప్రాయపడ్డారు. కానీ ఆన్లైన్ నిపుణులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. దొంగలు తమ పని సులువుగా చేసుకునేందుకు వెరిఫైడ్ అకౌంట్ను డబ్బు పెట్టి కొనే ఛాన్సు ఉందని అంటున్నారు. దుష్ప్రచారాన్ని ఆసరాగా చేసుకునే రష్యా, చైనా ప్రభుత్వాలు, తీవ్రవాద గ్రూపులు ఈజీగా బ్లూ టిక్ను కొనేస్తాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి.
బ్లూ టిక్ మార్క్ తాజాగా ఫేమస్ సెలబ్రిటీల అకౌంట్ నుంచి ఊడిపోయింది. ఆ జాబితాలో కిమ్ కర్షాషియన్, బియాన్సీ, బిల్ గేట్స్, పోప్ ఫ్రాన్సిస్, డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇక ఇండియన్స్లో ఫిల్మ్ స్టార్స్, పొలిటీషియన్స్ ఉన్నారు. ఇండియాలో బ్లూ టిక్ పెయిడ్ ఫీచర్ కోసం నెలకు రూ.650 ఛార్జ్ చేస్తున్నారు.