టెహ్రాన్, మార్చి 11: అమెరికా-ఇజ్రాయెల్తో యుద్ధం 12వ రోజుకు చేరిన క్రమంలో గ్లోబల్ చమురు మార్కెట్ తీవ్ర కుదుపునకు లోనవుతున్నది. ఈ క్రమంలో చమురు ఉత్పత్తి, ధరలపై ప్రపంచ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారీ స్థాయిలో పెరిగే చమురు ధరలకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని మిలిటరీ కమాండ్ పేర్కొన్నది. ‘సిద్ధంగా ఉండండి.. చమురు బ్యారెల్ ధర 200 డాలర్లు కానుంది. ఎందుకంటే చమురు ధరలు ప్రాంతీయ భద్రత మీద ఆధారపడి ఉన్నాయి. అయితే అది ఇప్పుడు అస్థిరంగా ఉంది’ అని ఇరాన్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫకరీ నేరుగా అమెరికాను ఉద్దేశించి హెచ్చరించారు. ప్రస్తుతానికి అమెరికా, ఇజ్రాయెల్పై పరిమితంగా చేస్తున్న ప్రతీకార దాడులను నిరంతర దాడులుగా మారుస్తామని అన్నారు. కాగా, ఇప్పటికే హొర్ముజ్ జలసంధిపై వాణిజ్య నౌకలను నిలిపివేసిన ఇరాన్, తాజాగా పర్షియన్ గల్ఫ్లో వాణిజ్య నౌకలపై దాడులు ప్రారంభించింది. తద్వారా ప్రపంచ దేశాలకు చమురు రవాణా కాకుండా అడ్డుకోవాలని భావిస్తున్నది.