ప్రెజెవ్డవ్ (పోలండ్), నవంబర్ 16: పోలండ్లో పడి ఇద్దరి మృతికి కారణమైన క్షిపణి కొద్దిసేపు ప్రపంచమంతటా కలకలం రేపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగి మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. ఆ క్షిపణిని రష్యానే ప్రయోగించిందని భావించిన నాటో కూటమి దేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జీ-20 దేశాల సమావేశం కోసం ఇండొనేషియాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్షిపణి దాడి వార్త తెలియగానే అత్యవసరంగా జీ-7, నాటో కూటమి నేతల సమావేశానికి పిలుపునిచ్చారు. పోలండ్ అధ్యక్షుడికి ఫోన్ చేసిన బైడెన్ ఘటనపై ఆరా తీశారు. బ్రస్సెల్స్లో బుధవారం సమావేశమైన నాటో దేశాలు వ్యూహరచనకు సిద్ధమయ్యాయి. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకూ ఆగాలని జర్మనీ, బ్రిటన్ సూచించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏదో ముంచుకొస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. అయితే పోలండ్ అధ్యక్షుడు అంద్రేజ్ దూడా సంయమనం పాటించడంతో అంతా సద్దుమణిగింది.
ఉక్రెయిన్పై ముప్పేట దాడికి పాల్పడుతున్న రష్యా మంగళవారం నాడు దాని విద్యుత్తు గ్రిడ్ లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో ఒక క్షిపణి పక్కనే ఉన్న పోలండ్ భూభాగంలోని పంట పొలాల్లోకి దూసుకొచ్చింది. దీంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ క్షిపణి రష్యాలో తయారైంది కావడంతో దానిని రష్యానే ప్రయోగించి ఉంటుందని తొలుత అందరూ భావించారు. పోలండ్ విదేశాంగ శాఖ కూడా ఆ మిస్సైల్ రష్యాలో తయారైందని ధ్రువీకరించింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఇండొనేషియాలో ఉన్న బైడెన్కు అతని సిబ్బంది నిద్రలేపి చెప్పారు.
తక్షణమే ఆయన పోలండ్ అధ్యక్షుడు అంద్రేజ్కు ఫోన్చేసి రైతుల మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు. పోలండ్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్తూ.. నాటో దేశాల జోలికి వచ్చేవారిపై ఉక్కుపాదం మోపుతామన్న తమ వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. ఆపై నాటో దేశాల సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ నేతృత్వంలో బ్రస్సెల్స్లో సైనిక కూటమి సమావేశమైంది. క్షిపణి దాడిపై దర్యాప్తు జరుగుతున్నదని, నిజానిజాలు వెల్లడైన తరువాత స్పందించాలని సమావేశం నిర్ణయించింది.
ముందు పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని జర్మనీ, బ్రిటన్ సూచించాయి. ఏదీ తేలకుండా రష్యాకు వ్యతిరేకంగా ఒక అభిప్రాయానికి రాకూడదని జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ షాల్జ్ హెచ్చరించారు. పోలండ్పై ఉద్దేశపూర్వకంగా క్షిపణిని ప్రయోగించారా లేక గురి తప్పి వచ్చి పడిందా అన్న సంగతి తేలాల్సి ఉన్నదని స్టోల్టెన్బర్గ్ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉండగా, ఆ క్షిపణిని తాము ప్రయోగించలేదని రష్యా నుంచి పలుమార్లు ప్రకటన వెలువడింది. ఈ లోగా క్షిపణి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ముగ్గురు అమెరికన్ నిపుణులు అది ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిందని తేల్చారు. ఉక్రెయిన్ వద్ద రష్యా తయారుచేసిన సోవియట్ కాలం నాటి క్షిపణులు భారీగానే ఉన్నాయి. వాటినే ప్రస్తుతం అది రష్యాపైకి ప్రయోగిస్తున్నది.
ఇది తెలియగానే బైడెన్ మాట మార్చారు. పోలండ్పైకి రష్యా క్షిపణి ప్రయోగించే అవకాశం లేదని అన్నారు. అయినా ఏం జరిగిందో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇంతలో పోలండ్ అధ్యక్షుడు అంద్రేజ్ దూడా ఒక ప్రకటన చేస్తూ తమ భూభాగంపై జరిగింది ఉద్దేశపూర్వక దాడి అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. రష్యా క్షిపణులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కూడా క్షిపణులను ప్రయోగించిందని, అవి వివిధ దిశల్లో వెళ్తూ దురదృష్టవశాత్తు ఒకటి తమ భూభాగంలో పడి ఉంటుందని అన్నారు. దీంతో దాదాపు 24 గంటలపాటు నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది.