China |బీజింగ్, జూన్ 12: చైనాలో ఉన్న భారత ఆఖరి జర్నలిస్టు ఆ దేశాన్ని వీడనున్నారు. పీటీఐకి చెందిన సదరు జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈనెల చివరి నాటికి ఆ జర్నలిస్టు భారత్కు తిరిగి పయనమవుతారు. 2023 ప్రారంభంలో నలుగురు భారతీయ జర్నలిస్టులు చైనాలో ఉండేవారు. వీసాపై నిషేధాజ్ఞలు విధించడంతో ఇద్దరు స్వదేశానికి చేరుకున్నారు. వీసా గడువు ముగియడంతో జూన్ 11న మరొకరు వెనక్కి వచ్చేశారు. తాజాగా ఆఖరి జర్నలిస్టు వీసా గడువును పొడిగించకపోవడంతో అతను కూడా స్వదేశానికి రానున్నారు.
చైనాకు చెందిన జర్నలిస్టులు భారత్లో అన్యాయానికి, వివక్షకు గురవుతున్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ సోమవారం ఆరోపించారు. 2020లో మొత్తం 14 మంది చైనా జర్నలిస్టులు భారత్లో ఉండగా, అక్కడి పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఒక్కరే మిగిలారని ఆయన పేర్కొన్నారు. చైనా ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. గతనెలలో భారత్లో జరిగిన ఎస్సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా జర్నలిస్టులకు అనుమతులు ఇచ్చామని తెలిపింది. భారత్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైనా జర్నలిస్టులు పని చేసుకుంటున్నారని, చైనాలో అలాంటి పని వాతావరణం లేదని పేర్కొంది.