హిరోషిమా, మే 20: కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో అప్పుల్లో కూరుకున్న దేశాలకు ఆర్థిక సాయమందిస్తామని జీ7 కూటమి దేశాధినేతలు ప్రకటించారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం జపాన్లోని హిరోషిమాలో ప్రారంభమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైల్వేలు, క్లీన్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 600 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహకారాన్ని అందిస్తామని నేతలు ప్రకటించారు.
ఈ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ అంతకుముందు హిరోషిమాలో చారిత్రక ఏ-బాంబ్ డోమ్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జీ7 సదస్సుకు హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్కు అత్యాధునిక ఎఫ్16 ఫైటర్ జెట్లను సరఫరా చేస్తామని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు.