ఇస్లామాబాద్: జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి పాకిస్థాన్ ప్రభుత్వం లేఖ రాసింది. పార్లమెంట్ గడువు మరో మూడు రోజులు ఉండగానే రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం గమనార్హం. ఎన్నికలకు మరింత గడువు తీసుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గడువుకు ముందే పార్లమెంట్ను రద్దు చేస్తే ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ గడువు ముగిస్తే, 60 రోజుల్లోగా ఎన్నికలు జరుపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు రోజులు ముందుగానే పార్లమెంట్ రద్దుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సిఫారసు చేసింది.