జెనీవా, మే 23: గడిచిన 50 ఏండ్లలో విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా మృత్యువాత పడినట్టు జెనీవాకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తెలిపింది. కఠిన వాతావరణ పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా గత వందేండ్లలో 4.3 ట్రిలియన్ డాలర్ల (రూ.35 లక్షల కోట్లకు పైగా) నష్టం సంభవించినట్టు పేర్కొన్నది. ప్రతి నాలుగేండ్లకు ఒకసారి జరిగే డబ్ల్యూఎంవో సదస్సు సందర్భంగా తాజా నివేదికను వెల్లడించింది. విపత్తులకు సంబంధించి గత హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే మరణాలను తగ్గించవచ్చని అభిప్రాయపడింది.
గత అర్ధ శతాబ్దంలో 12 వేల విపరీత వాతారణ పరిస్థితులు సంభవించినట్టు తెలిపింది. మానవ తప్పిదాల వల్ల తలెత్తే వాతావరణ మార్పుల వల్లే వరదలు, హరికేన్లు, తుఫాన్లు, వడగాలులు, కరువు పరిస్థితులు సంభవిస్తున్నాయని పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 90 శాతం అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిపిస్తున్నాయని, దురదృష్టవశాత్తు బలహీన సమూహాలపై దీని ప్రభావం ఎక్కువగా పడుతున్నదని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెట్టేరీ తాలస్ తెలిపారు. ఇటీవల మయన్మార్, బంగ్లాదేశ్లను ఉక్కిరిబిక్కిరి చేసిన మోఖా తుఫాను ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా 1970-2021 మధ్య అమెరికాలో 1.7 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్టు తాలస్ వివరించారు.