బెర్లిన్, మే 16: ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టిన పెర్మాఫ్రాస్ట్ కరిగి అక్కడి జీవరాశుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఈ మంచుగడ్డలు కరగడంతో విషపూరితమైన బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. తద్వారా అక్కడ ఉండే వేలకొలది జీవులు మృత్యువాతపడుతున్నాయి. ధూళి, కంకర, ఇసుక పదార్థాలు ‘0’ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రెండేండ్ల పాటు గడ్డకట్టిన స్థితిలో ఉంటే ఆ పదార్థాన్ని పెర్మాఫ్రాస్ట్ అని పిలుస్తారు. గ్రీన్ల్యాండ్, అలస్కా, రష్యా, చైనా, తూర్పు యూరప్ తదితర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి.
ఈ శతాబ్దం చివరి నాటికి 2 వేలకు పైగా గనులు, పైపులైన్లు లాంటి నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే 5 వేలకు పైగా ప్రాంతాలు మరింత ప్రమాదంలోకి జారుకున్నాయని తెలిపారు. మంచు కరిగి విడుదలయ్యే విషపూరిత సమ్మేళనాల వల్ల చేపలు, ఇతర జలచరాలు ప్రమాదంలో పడుతున్నాయని జర్మనీలోని ఆల్ఫ్రెడ్ వెనెగర్ ఇన్స్టిట్యూట్కి చెందిన నిపుణులు మోరిట్జ్ లాంగర్ తెలిపారు.