కొరత పేరుతో అధిక ధరకు ‘రెమ్డెసివిర్’
ఆక్సిజన్ లేదంటూ అదనపు వసూళ్లు
బిల్లుల్లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం
రంగంలోకి దిగిన పోలీస్ యంత్రాంగం
బ్లాక్ దందాపై ఫిర్యాదులకు ఆహ్వానం
మానవీయత చూపాల్సిన సందర్భమిది నల్లగొండ ఎస్పీ రంగనాథ్
ప్రభుత్వ సేవలను సద్వినియోగంచేసుకుంటున్న వాళ్లు 85శాతం మందికిపైనే..
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్23(నమస్తే తెలంగాణ) : కరోనా విపత్కర పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. 85శాతానికిపైగా పేషెంట్లు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకుంటూ క్వారంటైన్ సెంటర్లు, హోం ఐసొలేషన్లో కోలుకుంటుండగా, ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్న వారినే అవి టార్గెట్ చేస్తున్నాయి. అవసరం లేకున్నా రెమ్డెసివిర్ వంటి ఇంజక్షన్లతో హైరానాకు గురిచేస్తున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల విషయంలోనూ కొరత పేరుతో అదనంగా వసూళ్లు చేస్తున్నాయని, డ్రగ్ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడిందని ఆరోపణలొస్తున్నాయి. అండగా ఉండాల్సిన పరిస్థితుల్లో రోగులను ఆందోళనకు గురిచేస్తుండడంతో నల్లగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. అక్రమ వసూళ్లు, బ్లాక్ దందాపై నేరుగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ రంగనాథ్ శుక్రవారం ప్రజలకు సూచించారు.
ఉమ్మడి జిల్లాలో రెండో దఫా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. దీనికితోడు తొలి దఫాతో పోలిస్తే కొత్త వేరియంట్స్తో కరోనా ఎటాక్ చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో ఉన్న వేరియంట్తో పాటు సెకండ్, థర్డ్ వేరియంట్ ఇలా వైరస్ తీవ్రత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్షణాలూ లేకుండానే ప్రజలు కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే 90శాతం పైగా బాధితులు హోం ఐసొలేషన్లో ప్రభుత్వ, ప్రైవేట్ మందులతోనే కోలుకుంటుండడం మంచి పరిణామమే. కానీ, మిగతా 10శాతం మంది మాత్రం నిర్లక్ష్యమో, లేదంటే వైరస్ లోడ్ ఎక్కువగా ఉండడంతోనో ఇబ్బందులు పడుతున్నారు. మూడు నుంచి ఏడు రోజుల్లోపు జ్వరం తగ్గకపోవడం, శ్వాస సంబంధ సమస్యలు రావడం, ఊపిరి ఆడకపోవడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురవుతూ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొన్ని దవాఖానల యాజమాన్యాలు రోగులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల సిఫార్స్ కంటే తమకు లాభదాయకమైన సిఫార్స్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ఐసీయూ సేవలు, ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేషన్ సౌకర్యం ఇలా రకరకాల పేర్లతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు
కొన్ని దవాఖానల్లో స్పెషలిస్టు వైద్యులు లేకపోయినా అందరికీ ఒకేరకమైన వైద్యం చేస్తూ బిల్లులు మాత్రం అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో రోగికి ఆక్సిజన్ సరిగా అందక ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు రెమ్డెసివిర్ ఇంజక్షన్ వైపు వైద్యులు మొగ్గుచూపుతున్నారు. కొన్ని దవాఖానల్లో ఫ్యాబీఫ్లూ లాంటి ట్యాబ్లెట్లతో సరిపోయే వైద్యానికి కూడా ఎక్కువ లాభదాయకంగా కనిపిస్తున్న ఇంజక్షన్లకే సిఫార్స్ చేస్తున్నారని ఆయా దవాఖానల వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. అయితే ఈ ఇంజక్షన్ ఎంఆర్పీ రూ.3400 ఉండగా కొన్ని దవాఖానల యాజమాన్యలు అధిక ధరలు వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో రెమ్డెసివిర్(కోవిఫర్) సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. వీరి ద్వారానే దవాఖానలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే డిస్ట్రిబ్యూటర్ల వద్ద నుంచి ఈ ఇంజక్షన్ ఎంఆర్పీకే వచ్చేలా డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యవహరిస్తున్నది వాస్తవం. అయితే ఆ తరువాత ఇదే ఇంజక్షన్ను రోగికి అందజేసేటప్పుడు ఎంత బిల్లు వసూలు చేస్తున్నారనేది కీలకం.
కొన్ని సందర్భాల్లో ఒక్కో ఇంజక్షన్కు రూ.15వేల నుంచి 25వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా తమ నిఘాను కొనసాగించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు అటువైపు పోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా రోగికి దవాఖాన యాజమాన్యాలు వసూలు చేస్తున్న బిల్లులో రెమ్డెసివిర్ గానీ లేదంటే ఇతర మందులకు గానీ వేస్తున్న ధరలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ఓ కన్నేసి ఉంచాలని ప్రజలు సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఈ దఫాలో ఆక్సిజన్ అవసరం కూడా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాపైనా నిఘా తప్పనిసరి అయ్యింది. నల్లగొండలోని ఓ ప్రైవేట్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో కొరతను సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొరత పేరుతో రూ.2500 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. స్థానిక అవసరాలతో నిమిత్తం లేకుండా ఎవరూ ఎక్కువ ధర చెల్లిస్తే వాళ్లకే సరఫరా చేస్తున్నట్లు వైద్య వర్గాల్లో చర్చ సాగుతున్నది. ఇక కరోనా టెస్టుల పేరుతోనే అనుమతులు లేకున్నా అధిక డబ్బు వసూలు చేస్తున్న సంఘటనలూ ఉన్నాయి. గురువారం మిర్యాలగూడలోని ఓ ల్యాబ్ను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం అందరిపై ఉందన్నది సుస్పష్టం.
రంగంలోకి పోలీస్ యంత్రాంగం
కొవిడ్ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కరోనా మందులు, ఆక్సిజన్ సరఫరా, వైద్యసేవల్లో అధిక వసూళ్లపై నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగంతోపాటు వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వపరంగా చేయాల్సిన టెస్టులు, వ్యాక్సినేషన్, వైద్య సేవలపై పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ రంగంలో రోగులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవంటూ జిల్లా పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. కరోనా మందులు, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ రంగనాథ్ తన మొబైల్ నంబర్ 9440795600ను ప్రజలకు వెల్లడించారు. అదేవిధంగా కృత్రిమ కొరత సృష్టిస్తే కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు కూడా తమ వైద్యసేవల్లో మానవీయతను ప్రదర్శించాలని సూచించారు. అనవసర టెస్టులు, అధిక బిల్లులు, అవసరం లేని మందుల వినియోగం లాంటి వాటిపైనా ఫిర్యాదులు చేయవచ్చని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని దవాఖానలు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబుల్లో వైద్యశాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని, అక్రమాలకు పాల్పడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
సెంట్రల్ కాంట్రాక్టులోకి గ్రీన్
ఆషికీ’ స్వరకర్త శ్రవణ్ కన్నుమూత