బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు శ్రవణ్ రాథోడ్(66) గురువారం కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గత కొద్ది రోజులుగా ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో శ్రవణ్ గురువారం రాత్రి 10.15 సమయంలో తుదిశ్వాసవిడిచారు. నదీమ్ అక్తర్ సైఫీతో కలిసి శ్రవణ్ రాథోడ్ బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 1990 దశకంలో నదీమ్-శ్రవణ్ ద్వయం అజరామరమైన గీతాలతో సంగీత ప్రియుల్ని అలరించింది. 1990లో మహేష్భట్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికీ’ చిత్రంతో వీరి విజయప్రస్థానం ప్రారంభమైంది. ఇందులో నదీమ్-శ్రవణ్ స్వరపరచిన ప్రతి పాట ఓ ఆణిముత్యమే. బాలీవుడ్లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బమ్గా ‘ఆషికీ’ చరిత్ర సృష్టించడంతో ఈ సంగీతద్వయం పేరు మారుమోగింది . వీరిద్దరి కలయికలో వచ్చిన సాజన్, పూల్ ఔర్ కాంటే, సడక్, దీవానా, రంగ్, దిల్వాలే, హమ్ హై రహి ప్యార్ కే, రాజా, బర్సాత్, అగ్నిసాక్షి, రాజా హిందుస్థానీ, పరదేశీ, దడ్కన్, రాజ్, దిల్ కా రిస్తా, కసూర్, అందాజ్, సిర్ఫ్తుమ్, దిల్ హై తుమారాతో చిత్రాలు మ్యూజికల్ హిట్స్గా నిలిచాయి. పాశ్చాత్య సంగీత పోకడలకు దూరంగా హిందుస్థానీ సంగీతానికి ప్రాముఖ్యతనిస్తూ స్వరాల్ని సమకూర్చేవారు నదీమ్-శ్రవణ్.
2005లో అభిప్రాయభేదాలతో ఈ సంగీతద్వయం విడిపోయారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలిసి ఓ సినిమాకు సంగీతాన్ని అందించినా ఆ స్నేహబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. నదీమ్ నుంచి విడిపోయిన తర్వాత శ్రవణ్ తన తనయులు సంజీవ్, దర్శన్లతో కలిసి కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించారు. శ్రవణ్ మరణంతో బాలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రవణ్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రవణ్ మరణం ఎంతగానో బాధించిందని.. 90 దశకంలో తమ బాణీలతో సంచలనం సృష్టించిన గొప్ప స్వరకర్త శ్రవణ్ అని అక్షయ్కుమార్ నివాళులు అర్పించారు. శ్రవణ్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని గాయని శ్రేయాఘోషల్ పేర్కొంది. ఇటీవలే శ్రవణ్ తన భార్యతో కలిసి హరిద్వార్ కుంభమేళాకు వెళ్లొచ్చారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఆయన కరోనా బారిన పడినట్లు తనయుడు సంజీవ్ తెలిపారు.