Covid | బీజింగ్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందనే వాదనలు ఇప్పటికే ఉన్నాయి. దీనికి సంబంధించి తాజా నివేదిక ఒకటి సంచలన విషయాలు వెల్లడించింది. చైనా సైన్యంతో కలిసి పనిచేస్తున్న ఆ దేశంలోని వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు ప్రాణాంతకమైన కరోనా వైరస్లను కలిపి కొత్త మ్యుటెంట్ వైరస్ను సృష్టించారని పేర్కొన్నది.
ప్రమాదకరమైన ప్రయోగాలతో కూడిన కోవర్ట్ ప్రాజెక్టును చైనా శాస్త్రవేత్తలు నడుపుతున్నారని, దీని వలనే వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్ లీక్ అయిందని, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం సృష్టించిందని పరిశోధకులు విశ్వసిస్తున్నారని ది సండే టైమ్స్ నివేదించింది.
వందలాది పత్రాలు, అంతకు ముందటి రహస్య నివేదికలు, అంతర్గత మెమోలు, శాస్త్రీయ పేపర్లు, ఈమెయిళ్ల ఆధారంగా తాజా అధ్యయనం చేశారు. కొవిడ్-19 సృష్టికి చైనా మిటలరీనే ఫండింగ్ చేసిందని, చైనా జీవ ఆయుధాలను అనుసరిస్తున్నదని, అందుకే కొవిడ్ సృష్టికి సంబంధించిన ప్రచురణ సమాచారం లేదని ఓ పరిశోధకుడు పేర్కొన్నారు.