న్యూఢిల్లీ: వాళ్లిద్దరూ దిగ్గజ వ్యాపారవేత్తలు..! ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా..? వాళ్లలో ఒకరు ట్విటర్ (Twitter) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) అయితే, మరొకరు మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg). వ్యాపారపరమైన పోటీతో వీళ్లిద్దరూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలే కేజ్ ఫైట్కు సై అంటే సై అంటూ ఇద్దరూ ప్రతిస్పందించిన తీరు సోషల్మీడియాలో సంచలనంగా మారింది. ట్విటర్కు పోటీగా జుకర్బర్గ్ థ్రెడ్స్ను (Threads) తీసుకురావటం వివాదాన్ని రాజేసింది. పైగా ట్విటర్ వ్యాపార రహస్యాలు, ఇతర మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేశారని మస్క్ ఆరోపించడం అగ్నికి ఆజ్యం పోసింది. ఇలా ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నడుస్తున్న సమయంలో వాళ్లిద్దరూ కలిసి ఉన్న పోటోలు సోషల్మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఇద్దరికీ ఒకరంటే ఒకరు పడనప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఫొటోలు ఎలా దిగారంటారా..? మీ అనుమానం నిజమే. వాళ్లిద్దరూ కలిసి ఫొటోలు దిగలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఓ ట్విటర్ యూజర్.. వాళ్లిద్దరూ కలిసి దిగినట్టుగా ఫొటోలు సృష్టించాడు. ఆ ఫొటోలకు ఇంగ్లిష్లో ‘గుడ్ ఎండింగ్’ అనే క్యాప్షన్ జోడించి ట్విటర్లో షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో మస్క్, జుకర్బర్గ్ ఇద్దరూ బీచ్లో ఓ జంట ఫోటోషూట్లో పాల్గొన్నట్లుగా ఉన్నారు.
బిలియనీర్లిద్దరూ బీచ్లో నడుస్తున్నట్టుగా, ఒకరిని ఒకరు కౌగిలించుకున్నట్లుగా, ఇద్దరూ కలిసి బీచ్లో పరుగులు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ట్విటర్ యూజర్ ఆ ఫొటోలను క్రియేట్ చేశాడు. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేసిన కొద్దిసేపటికే 70 లక్షల మంది వీక్షించారు. మరో లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు.
ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ‘వాస్తవానికి వాళ్లు మీమ్స్ కోసం ఇలా కలిసి ఫోటోషూట్ చేయాలి’ అని ఒకరు, ‘వావ్ కపుల్ గోల్స్’ అని మరొకరు కామెంట్స్ చేశారు. ‘మస్క్ ఈ రోజు మెటాను కొనుగోలు చేశారా ఏంటీ?’ అని నెటిజన్ స్పందించాడు. ‘బీచ్లో ఒకరినొకరు చూసుకొని, కౌగిలించుకుని, చిన్న పిల్లల్లా చెప్పులు లేకుండా పరిగెత్తుతున్నారు’ అని ఇంకో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు.
The good ending ❤️ pic.twitter.com/smQjNTzc45
— Sir Doge of the Coin ⚔️ (@dogeofficialceo) July 14, 2023