న్యూఢిల్లీ, మే 29: అమెరికా, క్యూబా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బహుళ మార్గాల నుంచి క్యూబాపై అమెరికా ఒత్తిడి పెంచుతున్నది. ఇంధన అడ్డంకులు ఇప్పటికే అమలులో ఉండగా యుద్ధ నౌకలు, నిఘా విమానాలు, ఇతర సైనిక బలగాల మోహరింపును కరీబియన్లో అమెరికా ముమ్మరం చేసింది. ఈ నెల 20న యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ రాకతో ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది.
క్యూబా తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటున్నది. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు, ప్రజా రవాణాకు అంతరాయం, పారిశ్రామిక కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఒత్తిడిలో ఉన్న క్యూబా ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత భారాన్ని మోపింది. రష్యా, చైనాలతో క్యూబాకు ఉన్న సంబంధాల కారణంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల దానిని జాతీయ భద్రతా ముప్పుగా వర్ణించారు.
మరోపక్క యుద్ధం రక్తపాతానికి దారితీస్తుందని, వేలాది క్యూబన్లు, అమెరికన్లు మరణిస్తారని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్స్ హెచ్చరించారు. 1959లొ జరిగిన క్యూబన్ విప్లవం తర్వాత అమెరికా, క్యూబాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.