కీవ్: రష్యా దాడి వల్ల దక్షిణ నగరమైన మారియపోల్లో వేలాది మంది మృతిచెంది ఉంటారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వ నేతలతో జరిగిన వీడియో మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. మారియపోల్ను సర్వనాశనం చేశారని, వేలాది మంది అక్కడ మృతిచెంది ఉంటారని, అయినా కానీ, రష్యా తన దండయాత్రను ఆపడంలేదని జెలెన్స్కీ అన్నారు. ఆ నగరం నుంచి భారీ సంఖ్యలో శరణార్థులు పారిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ వేలాది మంది మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. భారీ భారీ గొయ్యిల్లో ఆ మృతదేహాలను ఖననం చేశారు. చెచన్ ఫైటర్లు అక్కడ లూటీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆకలి, దాహాం తట్టుకోలేక షెల్టర్ల నుంచి బయటకు వెళ్లిన వారిని చంపేస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.