కాబూల్: ముఖానికి ముసుగు వేసుకోని మహిళను తాలిబన్లు గన్తో కాల్చి చంపారు. ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆఫ్ఘనిస్థాన్ టైమ్స్ పేర్కొంది. బల్ఖ్ జిల్లా కేంద్రానికి కారులో వెళ్తున్న 21 ఏండ్ల నజనీన్ తాలిబన్ ఉగ్రవాదులు వాహనం నుంచి బయటకు లాగారు. బురఖా ధరించనందుకు తుపాకీతో ఆమెను కాల్చి చంపారు. అయితే తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ ఆరోపణలను ఖండించారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైనిక దళాల ఉపసంహరణతో తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 1996-21 మధ్యలో అమలు చేసిన కఠిన చట్టాలను తాలిబన్లు మళ్లీ ప్రవేశపెట్టారు. మహిళలు తల నుంచి కాళ్ల వరకు పూర్తిగా ముసుగు ధరించాలని, మగవారి తోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఒంటరిగా షాపింగ్కు వచ్చే మహిళలకు ఏమీ అమ్మకుండా కొన్ని ప్రాంతాల్లో షాపులను నిషేధించారు. ఉల్లంఘించిన వారికి బహిరంగ దెబ్బలతోపాటు కఠిన శిక్షలు విధిస్తామని తాలిబన్లు హెచ్చరించారు.