కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మళ్లీ తాలిబన్ల ( Taliban ) చేతుల్లోకి వెళ్తోంది. పది రోజులుగా దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తున్న ఈ తిరుగుబాటు దారులు.. ఆదివారం రాజధాని కాబూల్లోకి కూడా వచ్చారు. దీంతో అక్కడి ప్రభుత్వం దిగి వచ్చింది. తాలిబన్లకు శాంతియుతంగా అధికార బదిలీ చేస్తామని అక్కడి మంత్రి వెల్లడించారు. ఇప్పటికే తాలిబన్ల తరఫున మధ్యవర్తులు చర్చల కోసం అధ్యక్ష భవనానికి వెళ్లారు. దీంతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికార పీఠం నుంచి దిగిపోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు తాలిబన్లు కాబూల్లోకి చొచ్చుకొని రావడంతో అమెరికా తన ఎంబసీలోని వారిని హెలికాప్టర్లలో సురక్షితంగా అక్కడి నుంచి తరలిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కాబూల్ను బలవంతంగా ఆక్రమించాలన్న ఉద్దేశం తమకు లేదని అంతకుముందు తాలిబన్లు చెప్పారు. వాళ్లు నగరంలోకి అన్ని వైపుల నుంచీ వస్తున్నట్లు ఆఫ్ఘన్ అధికారి ఒకరు వెల్లడించారు. కాబూల్లో ఎలాంటి హింసకు పాల్పడొద్దని తిరుబాటుదారుల నాయకత్వం ఇప్పటికే తమ వారికి సూచించింది. కాబూల్ను వీడి వెళ్లిపోయే వారికి ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దనీ స్పష్టంచేసింది.