వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్పై జరిగిన దాడి వెనుకున్న సూత్రధారిని తాలిబన్ చంపినట్లు (Taliban Killed Mastermind) అమెరికా తెలిపింది. ఆ వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతని వెల్లడించింది. 2021 ఆగస్ట్లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలగుతున్న తరుణంలో తాలిబన్ దళాలు మెరుపు వేగంతో రాజధాని కాబూల్లోకి ప్రవేశించాయి. దీంతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. ఈ పరిణామాలతో భయాందోళన చెందని ఆఫ్ఘన్ ప్రజలు దేశం నుంచి వెళ్లిపోయేందుకు వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 26న కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద భారీ స్థాయిలో బాంబు పేలుడు జరిగింది. ఈ దాడి సంఘటనలో 13 మంది అమెరికా సైనికులతోపాటు 170 మంది ఆఫ్ఘనిస్థాన్ పౌరులు మరణించారు.
కాగా, కాబుల్ విమానాశ్రయంపై బాంబు దాడి వెనుక సూత్రధారి అయిన ఉగ్రవాదిని ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం చంపిందని అమెరికా అధికారి తెలిపారు. ఆ అనుమానిత సూత్రధారి ఐఎస్-కే ఉగ్రవాద సంస్థకు చెందిన నేతగా పేర్కొన్నారు. అయితే ఆ ఉగ్రవాది పేరును బయటపెట్టలేదు. అలాగే తాలిబన్లు అతడ్ని ఎలా పట్టుకున్నారు, ఎప్పుడు చంపారు అన్నది కూడా అమెరికా వెల్లడించలేదు.
అమెరికా జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల సమన్వయకర్త జాన్ కిర్బీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఎస్-కే ఉగ్రవాద సంస్థ ఈ ఏడాది అత్యున్నత స్థాయి నాయకుడ్ని కోల్పోయినట్లు సీఎస్ఎన్ వార్తా సంస్థతో అన్నారు. ఈ ఆపరేషన్లో అమెరికా పాల్గొనలేదని తెలిపారు. అలాగే ఐఎస్-కే ఉగ్రవాద సంస్థ కీలక నేత మరణం గురించి తాలిబన్లు అమెరికాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్లోని సొంత నిఘా వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్లు ఆయన వెల్లడించారు.