కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ముగిసినట్లు తాలిబన్లు ( Taliban ) ప్రకటించారు. కాబూల్లో అధ్యక్ష భవనాన్ని చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు ఈ ప్రకటన చేశారు. అధ్యక్ష భవనంలోనే తాలిబన్ నేతలు చర్చలు నిర్వహించారు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లడంతో అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు వేలాది మంది పౌరులు ఆఫ్గన్ విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి బారులు తీరారు.
ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాయిద్దిన్లకు ఇవాళ ఓ గొప్ప దినమని, 20 ఏళ్లుగా చేసిన త్యాగాలకు వాళ్లు ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు తాలిబన్ పొలిటిక్ ఆఫీస్ ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ తెలిపారు. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని, ఈ దేశంలో యుద్ధం ముగిసిందని ఆయన అన్నారు. అమెరికా భద్రతా దళాలు వెనుదిరిగిన కొన్ని రోజుల్లోనే ఆఫ్ఘన్ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం శోచనీయం. తాలిబన్ కమాండర్లు అధ్యక్ష భవనంలో సాయుధ ఫైటర్లతో కలిసి సమావేశం కావడం కూడా ఆ దేశ దీన స్థితిని తెలుపుతుంది.
దేశంలో కొత్త పాలనకు సంబంధించిన ప్రకటన త్వరలో చేయనున్నట్లు తాలిబన్ల ప్రతినిధి నయీమ్ తెలిపారు. తాలిబన్లు ఏకాకిగా ఉండాలని భావించడం లేదని, శాంతియుత అంతర్జాతీయ సంబంధాలను ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అనుమతి లేకుండా ఎవరి ఇంట్లోకి కూడా ప్రవేశించవద్దు అని సాయుధ ఫైటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తాలిబన్ ప్రతినిధి సుహేల్ షాహీన్ తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రాణాలను, ఆస్తులను రక్షించాలని ముజాయిద్దిన్లకు ఆదేశించినట్లు సుహేల్ తన ట్వీట్లో తెలిపారు.