ల్వీవ్, మార్చి 11: ఉక్రెయిన్ ఆక్రమణలో అనూహ్య ప్రతిఘటనను ఎదుర్కొంటున్న రష్యా కీలక నిర్ణయం తీసుకొన్నది. సిరియా నుంచి ‘వలంటరీ సైన్యాన్ని’ యుద్ధక్షేత్రంలో దించనున్నది. ఈ ప్రతిపాదనకు అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. అంతకుముందు రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగు మాట్లాడారు. ‘మధ్యప్రాచ్యం నుంచి వేలాది మంది రష్యాకు మద్దతు పలుకుతున్నారు. యుద్ధంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు 16వేల దరఖాస్తులు వచ్చాయి’ అన్నారు. ‘వలంటరీ సైన్యాన్ని ఉక్రెయిన్కు తరలించడానికి చర్యలు తీసుకోండి. వారికి సాయం చేయండి’ అని పుతిన్ రక్షణ మంత్రిని ఆదేశించారు. సిరియాకు, రష్యాకు మధ్య బలమైన సంబంధాలున్నాయి. ఐసిస్పై పోరాటంలో సిరియాకు రష్యా మద్దతు ఇచ్చింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ రష్యా ఆయనను వెనుకేసుకువస్తున్నది. రష్యా మద్దతును గుర్తు పెట్టుకొనే ఇప్పుడు వలంటరీ సైన్యం ముందుకు వస్తున్నదని షోయిగు అన్నారు.
దాడులు మరింత తీవ్రతరం
శుక్రవారం పశ్చిమ ఉక్రెయిన్లోని ఎయిర్పోర్టుల దగ్గర్లో బాంబు దాడులకు రష్యా పాల్పడుతున్నది. తూర్పు ఉక్రెయిన్లోని మేజర్ ఇండస్ట్రియల్ హబ్ అయిన నీప్రో నగరం పైన కూడా రష్యా దాడులకు తెగబడింది. మరోవైపు, కీవ్ సమీపంలో ఆగిపోయిన 65 కిలోమీటర్ల పొడవైన రష్యా మిలిటరీ కాన్వాయ్ కదిలింది.
నాటో, రష్యా నేరుగా తలపడితే మూడో ప్రపంచ యుద్ధమే: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రసాయనిక ఆయుధాలు ప్రయోగిస్తా రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. రష్యాతో నాటో నేరుగా ఢీకొంటే అది మూడో ప్రపంచయుద్ధానికి దారితీస్తుందని పేర్కొన్నారు.
జీవాయుధాల్లేవు
ఉక్రెయిన్లో జీవ ఆయుధాలను తయారు చేస్తున్నారన్న పుతిన్ ఆరోపణలను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ‘మానవ విధ్వంసం సృష్టించే ఎలాంటి రసాయన ఆయుధాలను గానీ మరే ఇతర ఆయుధాలను కానీ ఉక్రెయిన్లో తయారు చేయడం లేదు’ అని ప్రకటించారు. ఉక్రెయిన్పై రసాయనిక దాడులు చేయడానికి రష్యా ఈ తరహా ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నారు.
భారత్ కృతజ్ఞతలు
భారతీయ విద్యార్థుల తరలింపునకు అవకాశం కల్పించినందుకు రష్యా, ఉక్రెయిన్కు, సాయం చేసినందుకు రెడ్ క్రాస్ సంస్థకు, ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు భారతదేశం కృతజ్ఞతలు తెలిపింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు ఫిబ్రవరి 26న ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18వేల మందిని స్వదేశానికి తీసుకువచ్చారు. సుమీ నగరంలో చిక్కుకుపోయిన విద్యార్థులను పోలెండ్ నుంచి తీసుకువచ్చిన భారత వైమానిక దళ విమానం శుక్రవారం మధ్యాహ్నం హిండన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయింది.