జెనీవా, అక్టోబర్ 29: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును నడిపి రికార్డు సృష్టించేందుకు స్విట్జర్లాండ్ ప్రయత్నించబోతున్నది. ఏకంగా 100 బోగీలు, నాలుగు ఇంజిన్లతో 1.9 కిలోమీటర్ల (1.2 మైళ్ల) పొడవైన ఈ రైలును ప్రకృతి రమణీయతకు నెలవైన ఆల్ఫ్స్ పర్వతాల్లోని అల్బులా/బెర్నినా మార్గంలో ప్రెడా నుంచి బెర్గుయెన్ వరకు శనివారం నడిపేందుకు స్విస్ రైల్వే కంపెనీ ‘రేటియన్’ సిద్ధమైంది.
ప్రఖ్యాత ల్యాండ్వాసర్ వయాడక్ట్ సహా 48 వంతెనలు, 22 సొరంగాల గుండా పర్వత సానువుల మధ్యన ఒంపులు తిరుగుతూ సాగే ఈ మార్గాన్ని యునెస్కో 2008లోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. మొత్తం 25 కిలోమీటర్ల (15.5 మైళ్ల) దూరం సాగే ఈ ప్రయాణం పూర్తయ్యేందుకు దాదాపు గంట సమయం పడుతుంది.