Sunita Williams | భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా షెడ్యూల్ను సవరించింది. దాంతో ఆమె మరోనెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. మార్చిలో తిరిగి భూమిపైకి చేరుకునే అవకాశాలున్నాయి. స్పేస్ఎక్స్ క్రూ-10 మిషన్లో ఆలస్యం నేపథ్యంలో ఆలస్యమవుతున్నట్లు నాసా పేర్కొంది. వారం రోజుల మిషన్ కోసం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్లో బోయింగ్కు చెందిన స్టార్లైనర్ షిప్లో ఐఎస్ఎస్కు వెళ్లారు. అయితే, సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. జూన్ 6న ఇద్దరూ వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి వెళ్లగా.. అదే నెల 14న తిరిగి భూమిపైకి రావాలి. కానీ, స్టార్ లైనర్లో హీలియం లీకేజీ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది.
ఆ తర్వాత స్టార్లైనర్ షిప్ వ్యోమగాములను ఐఎస్ఎస్లోనే వదిలి.. ఒంటరిగా తిరిగి భూమిపైకి చేరింది. ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా.. స్పేస్ఎక్స్ కూ-9ని సిద్ధం చేస్తున్నది. ఈ మిషన్ ఈ ఏడాది సెప్టెంబర్ను లాంచ్ చేసింది. క్రూ-9 అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్కు రెండు ఖాళీ సీట్లను ఖాళీగా ఉంచింది. క్రూ-9కి బదులుగా.. క్రూ-10లో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త స్పేస్క్రాఫ్ట్ని సిద్ధం చేసేందుకు స్పేస్ఎక్స్కు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయోగాన్ని మార్చి 2025కి వాయిదా వేసింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల ప్రయాణం కాస్త తొమ్మిది నెలలపాటు ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉండగా.. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఛాలెంజర్, కొలంబియా ఘటనలను గుర్తు చేశారు.