Suicide Attack | పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి (Suicide Attack) పాల్పడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు (Soldiers) ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province) లోని బన్నూ (Bannu ) జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఆత్మాహుతి బాంబర్ మోటార్ సైకిల్పై భద్రతా అధికారుల వాహనానికి ఎదురెళ్లి తనను తాను కాల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పాకిస్థాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ విచారం వ్యక్తం చేశారు. ‘బన్నూ డివిజన్లో టెర్రరిస్టుల ఆత్మాహుతి దాడిలో 9 మంది సైనికులు మృతి చెందారనే వార్త విని గుండె పగిలింది. అలాంటి చర్యలను ఖండిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ దృఢంగా ఉంది’ అని తెలిపారు. కాగా, ఈ దాడికి నిషేధిత తెహ్రీక్ – ఏ – తాలిబన్ పాకిస్థాన్ (Tehreek-e-Taliban Pakistan) సంస్థ బాధ్యత వహించింది.
కాగా, ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 30వ తేదీన ఓ రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడుకు పాల్పడటంతో 54 మంది మరణించారు. సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు.
Also Read..
Viral Video | పెళ్లి విందులో కుర్చీలతో కొట్టుకున్న అతిథులు.. వీడియో
Petrol Price | తీవ్ర ఆర్థిక సంక్షోభం.. పాక్ చరిత్రలో తొలిసారి రూ.300 దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు