టెహ్రాన్ : నౌకాయానానికి వీలు లేకుండా హొర్ముజ్ జలసంధిని మూసివేసినట్టు ఇరాన్ మరోసారి ప్రకటించింది. గల్ఫ్లో అమెరికా తన చట్టవిరుద్ధ కదలికలను కొనసాగిస్తూనే ఉందని ఆరోపించింది. కాగా, ఇరాన్ ప్రకటనకు విరుద్ధంగా ఈ వ్మూహాత్మక జలమార్గం తెరిచే ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్కు దానిపై ఎలాంటి నియంత్రణ లేదని, ఈ మార్గంలో నౌకల వాణిజ్య రవాణా యథా ప్రకారం కొనసాగుతున్నదని స్పష్టం చేసింది. కాగా, ఈ ప్రాంతంలో అమెరికా వైఖరి కారణంగా ఈ జలసంధి మీదుగా ఎలాంటి నౌకల రాకపోకలను అనుమతించబోమని టెహ్రాన్కు చెందిన పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ (పీజీఎస్ఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే హొర్ముజ్ జలసంధి మూసివేసినట్టు ఇరాన్ చేసిన ప్రకటనను అగ్రరాజ్యం తోసిపుచ్చుతూ ఈ జలమార్గంలో నౌకాయానం యథావిధిగా జరుగుతున్నదని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నిర్ధారించారు. ఈ మార్గంలో వాణిజ్య నౌకల రవాణాకు ఎలాంటి ఆటంకం లేదని పేర్కొన్నారు.
హొర్ముజ్ జలసంధిని మూసివేయడం, పశ్చిమాసియాలో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం చూస్తుంటే భారత్లో మరోసారి చమురు, ఎల్పీజీ సంక్షోభం తప్పదని అనిపిస్తున్నది. భారత్కు అధిక మొత్తంలో చమురు, ఎల్పీజీ హొర్ముజ్ జలసంధి మీదుగానే దిగుమతి అవుతుండటంతో మరోసారి చిక్కులు తప్పేట్టు లేవు.
హొర్ముజ్ మూసివేత కనుక కొనసాగితే మొట్టమొదట మన దేశంలో ఏర్పడేది గ్యాస్ కొరతే. జూలై 9 తర్వాత అమెరికా తాజా దాడుల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 79 డాలర్లకు ఎగబాకింది. అలాగే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత కూడా ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారింది. యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ల్లో సుమారు కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు.