Strait of Hormuz : ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి కూడా అందుబాటులోకి రానుంది. దీంతో ఇకపై ఈ మార్గం గుండా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి. కానీ, ఇక్కడే ఇరాన్ మెలికపెట్టబోతుంది. ఇకపై హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై పన్నులు విధించే ఆలోచన చేస్తోంది ఇరాన్. ఇప్పటికే ఈ అంశంపై ఇరాన్ పార్లమెంట్లో చర్చ జరిగింది. దీనికి అవసరమైన బిల్లును కూడా ఆమోదించింది.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉంది. దీనిపై ఐఆర్జీసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇది అమలులోకి వస్తే హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలు ఇకపై ఇరాన్ నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో 20 శాతం ఈ జలసంధి నుంచే వెళ్లాలి. ప్రపంచంలో వాణిజ్యపరంగా ఇది అత్యంత కీలకమైన, రద్దీ అయిన జలమార్గం. ఇరాన్ ఈ ఫీజును సెక్యూరిటీ రిలేటెడ్ ఫీగా వసూలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో భద్రత కోసం అవసరమైన నిర్వహణ ఛార్జీలను నౌకల నుంచి వసూలు చేయబోతుంది. ఇది ఇరాన్కు మంచి ఆదాయ వనరుగా మారనుంది. అయితే, ఈ నిర్ణయంపై వాణిజ్య నౌకలు, రవాణా, చమురు సంబంధిత వర్గాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల నౌకలపై, చమురు సంస్థలపై, అనేక దేశాలపై అదనపు భారం పడుతుంది.
సరుకు రవాణా, ఇన్స్యూరెన్స్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే ఈ మార్గంలో వెళ్లే నౌకలపై ఇన్స్యూరెన్స్ ఇచ్చే కంపెనీలు ప్రీమియం పెంచబోతున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా నౌకల రవాణాపై ఇరాన్ దళాలు ఆధిపత్యం చెలాయిస్తే మరింత ఇబ్బంది తప్పదు. ఇక, అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా పెరుగుతాయి. అమెరికాతో యుద్ధం ద్వారా కలిగిన ఆర్థిక నష్టాన్ని ఇరాన్.. హార్ముజ్ వద్ద పన్నుల రూపంలో భర్తీ చేయనుంది. ఈ నిర్ణయం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.